-Advertisement-

AP: భార్య మృతదేహాన్ని కావడి పై స్వగ్రామానికి తీసుకొచ్చిన భర్త..

Vaasthava Nestham

- ఆంధ్రప్రదేశ్ లో అమానవీయ ఘటన


వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: తన కుమారుడు అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని జీర్ణించుకోలేక తల్లి సైతం తనువు చాలించింది. నెల రోజుల వ్యవధిలో గంగన్న కుమారుడు, గంగన్న భార్య మృతి చెందారు. మృతిచెందిన తన భార్య మృతదేహాన్ని కావడి పై ఓ భర్త తన స్వగ్రామానికి తీసుకొచ్చిన అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. భార్య మృతదేహాన్ని భర్త కొంతమేర బైక్ పై, మరి కొంత దూరం కావడితో స్వగ్రామానికి తరలించిన హృదయ విధార ఘటన అందరితో కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఎస్ కోట మండలం చిట్టెంపాడుకి చెందిన మాదల గంగన్న, గంగమ్మ లకు ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. అకస్మాత్తుగా వారి కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం స్వగ్రామం చిట్టెంపాడు గిరిశిఖర గ్రామం నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అతి కష్టం మీద కుమారుడిని డోలిలో క్రిందకి చేర్చి అక్కడ నుండి విశాఖ ఆస్పత్రికి తరలించారు. అయితే గంగన్న కుమారుడు చికిత్స పొందుతూనే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి లోనే మృతి చెందాడు. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి గంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురై ఆమె కూడా అనారోగ్యానికి గురైంది. దీంతో వెంటనే గంగన్న తన భార్యను తీసుకొని కావడి సహాయంతోనే చిట్టెంపాడు నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు చేర్చి అక్కడ నుండి విశాఖ ఆసుపత్రికి తరలించారు. గంగమ్మ కూడా చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించింది. వారం రోజుల వ్యవధిలో భార్యతో పాటు ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందటంతో కన్నీరు మున్నీరుగా రోదించాడు. ఇక చేసేదిలేక గంగమ్మ మృతదేహాన్ని విశాఖ ప్రైవేట్ ఆస్పత్రి నుండి స్వగ్రామానికి తరలిం చేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఎస్ కోట వరకు ఆటోలో తీసుకెళ్ళాడు. అలా మృతదేహాన్ని ఎస్ కోటలో దించి అక్కడ నుండి ఆటో డ్రైవర్ వెనుతిరిగాడు. అయితే ఎస్ కోట నుండి కొండ దిగువన ఉన్న దబ్బగుంట వరకు మరో ఆటోలో తరలించేందుకు గంగన్న వద్ద డబ్బులు లేవు. దీంతో స్నేహితుడి బైక్ పైనే కూర్చోబెట్టి నానా అవస్థలు పడుతూ కొండ దిగువన ఉన్న దబ్బగుంటకి మృతదేహాన్ని తరలిం చాడు. అనంతరం అక్కడ నుండి కొండ మీద ఉన్న తన స్వగ్రామమైన చిట్టెంపాడుకి కావడి సహాయంతోనే సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల మధ్య అనేక అగచాట్లు పడి భార్య గంగమ్మ మృతదేహాన్ని ఇంటికి తరలించాడు. గంగన్న కష్టాన్ని చూసిన స్థానికులకు ఏడుపు ఆగలేదు. గంగన్న తన భార్య మృతదేహాన్ని బైక్ పై తరలిస్తుంటే స్థానికులందరూ ప్రేక్షక పాత్ర పోషించారే తప్పా ఏ ఒక్కరూ మానవత్వంతో సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడం చర్చనీయాంశమైంది. 
Comments
 -Advertisement-