-Advertisement-

పార్లమెంట్ ఎన్నికల్లో ‘ప్రయారిటీస్’ వేరువేరుకాంగ్రెస్ కు ‘ఖట్టా - మీఠా’ సిచ్యుయేషన్

Vaasthava Nestham
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పై భరోసా ఉంచారు. 64 స్థానాల్లో విజయతీరాలకు చేర్చారు. ఇదే జోష్ లో కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. 17 లోక్ సభ స్థానాల్లో నుంచి 10-15 చోట్ల విజయకేతనం ఎగరేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. దీంతో ఆ పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటే విజయం వరించినట్టేననే భావన చాలా మంది లీడర్లలో ఏర్పడింది. మరోవైపు ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ‘ప్రయారిటీస్’ వేరువేరుగా ఉంటాయని ‘చరిత్ర’ చెబుతున్నది. ‘అధికార’ భావనలో లోక్ సభ ఎన్నికలను లైట్ తీసుకుంటే మొదటికే మోసం జరిగే ప్రమాదమున్నది.

2018-19లో ఇలా..
తెలంగాణలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా, ఆరు నెలల గ్యాప్ తర్వాత 2019 లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు దక్కించుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది. సీట్ల పరంగా కాంగ్రెస్ రెండు, ఎంఐఎం మూడో స్థానంలో నిలవగా, కేవలం ఒక్క స్థానంతో బీజేపీ నాలుగో స్థానానికి పరిమితమైంది. అయితే ఆరు నెలల తర్వాత 2019 మే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో టీఆర్ఎస్ 9 స్థానాలను మాత్రమే సాధించగలిగింది. బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అసలు బీజేపీ ఉందా లేదా అన్న తీరున ఉన్న పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల సమయానికి వచ్చే సరికి రెండో స్థానంలో నిలిచింది.

ఇతర రాష్ట్రాల్లోనూ..
2018లో తెలంగాణతోపాటు మరో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఏడాది, అంతకంటే తక్కువ సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. 2018లో మధ్యప్రదేశ్ లో 114 సీట్లు గెలిచి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అధికారాన్ని చేజిక్కించుకున్నా.. అంతర్గత కలహాలతో ఆ తర్వాత అధికారాన్ని రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి అప్పగించాల్సి వచ్చింది. అయితే ఏడాది తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో 28 స్థానాలను బీజేపీ చేజిక్కించుకుంది. రాజస్థాన్ లో 199 స్థానాలు ఉండగా, 99 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఇక్కడ కూడా రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలు ఉండగా, కాంగ్రెస్ 68 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 15 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే ఏడాది తర్వాత మొత్తం 11 పార్లమెంట్ స్థానాల్లో 9ని చేజిక్కించుకుని బీజేపీ సత్తా చాటింది.

సమాఖ్య ప్రజాస్వామ్యం..
భారత ప్రజాస్వామ్యంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నా.. వారు పని చేసే విధానం వేరువేరుగా ఉంటుంది. అందుకే ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు వేరువేరుగా స్పందిస్తారు. ఇది గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఏడింటికి ఏడు స్థానాల్లో విజయాన్ని సాధించి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఏడాది తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో నుంచి 62 స్థానాలను ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి ప్రభంజనాన్ని సృష్టించింది. పార్లమెంట్ కు ఎవరిని ఎన్నుకోవాలి, అసెంబ్లీకి ఎవరిని పంపించాలనే దానిపై ఢిల్లీ ఓటరు పూర్తి స్పష్టతతో వ్యవహరించాడు. 2019లో ఒరిస్సా లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే సారి జరిగాయి. అయితే పార్లమెంట్ కోసం బీజేపీని, అసెంబ్లీ కోసం బీజేడీని ప్రజలు ఎన్నుకున్నారు. ఈ గణాంకాలు చూస్తే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో ఓటర్ల వ్యవహార శైలి, స్పందించే తీరు వేరువేరుగా ఉంటుందని అర్థమవుతోంది.

కాంగ్రెస్ కు ‘ఖట్టా - మీఠా’ సిచ్యుయేషన్
కర్ణాటక, తెలంగాణలో విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్.. 2023లో రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో అధికారాన్ని కోల్పోయింది. మధ్యప్రదేశ్ లోనూ చావు దెబ్బతిన్నది. వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే.. కేంద్రంలో మళ్లీ ఓటమిని చవిచూసే అవకాశమున్నది. 2018-19లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతోపాటు, 2020లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఏదైనా పార్టీ చిత్తశుద్ధితో కలిసి కష్టపడితే రాజకీయ పరిణామాలను పూర్తిగా మార్చేయొచ్చనేది స్పష్టమవుతోంది. దీంతో గెలిచిన చోట గర్వానికి పోకుండా.. ఓడిన చోట కుంగిపోకుండా.. ముందుకు సాగితేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.

- ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9640466464
Comments
 -Advertisement-