-Advertisement-

కట్టుకున్నోన్ని కడతేర్చి.. ఆపై గుండెపోటు అని కట్టుకథ..!

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: భర్తను దారుణంగా హతమార్చి ఆపై గుండెపోటుతో మరణించాడని కట్టుకథ అల్లింది ఓ మహిళ. బంధువులు సహా అందర్నీ నమ్మించి అంత్యక్రియలు చేయించింది. అయితే హత్య చేసిన నిందితుల్లో ఒకడు పోలీసుల వద్ద లొంగిపోవడంతో ఆ మహిళ వ్యవహారం మూడున్నర నెలల తర్వాత బయటపడింది. ఈ ఘటన మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఇనుపరాడ్లు, డంబెళ్లతో దాడి చేసి దారుణంగా హత్య..

ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్‌నగర్‌లోని ఓ అపార్టుమెంటులో విజయ్‌కుమార్‌, శ్రీలక్ష్మి దంపతులు ఉంటున్నారు. వారికిద్దరు పిల్లలు. శ్రీలక్ష్మికి రాజేశ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధముంది. శ్రీలక్ష్మికి పెళ్లి కాకముందే వీరిద్దరు ప్రేమికులు. ఆ సంబంధాన్ని పెళ్లి అయిన తర్వాత కూడా కొనసాగించారు. ఇది ఎప్పటికైనా భర్తకు తెలిస్తే ఇబ్బందేనని భావించిన శ్రీలక్ష్మి భర్త విజయ్‌కుమార్‌ (40) ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. రాజేశ్‌తో చెప్పడంతో సరేనన్నాడు. తనకు పరిచయమున్న సనత్‌నగర్‌కు చెందిన పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డి (40) మద్దతు తీసుకొని, రౌడీషీటర్‌ అయిన రాజేశ్వర్‌రెడ్డిపై మొత్తం 8 కేసులున్నాయి. ఇతని సూచనతో మహ్మద్‌ మైతాబ్‌ అలియాస్‌ బబ్బన్‌ సాయం కూడా తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న విజయ్‌కుమార్‌ తన పిల్లల్ని స్కూలులో దింపేందుకు వెళ్లాడు. అప్పటికే ఇంటికి దగ్గర్లో ఉన్న రాజేశ్‌, పటోళ్ల రాజేశ్వర్‌రెడ్డి, మైతాబ్‌ను శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి టాయిలెట్లో దాచింది. పిల్లల్ని దింపి విజయ్‌ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపలి నుంచి గడియపెట్టింది. వెంటనే రాజేశ్‌, రాజేశ్వర్‌రెడ్డి, మైతాబ్‌ టాయిలెట్ నుంచి బయటకు వచ్చి కలిసి కసరత్తులకు ఉపయోగించే డంబెళ్లు, ఇనుపరాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. అప్పుడు విజయ్‌ భయంతో 'తనను చంపొద్దని, కావాలంటే ఎంతైనా కొట్టి వదిలేయాలని వేడుకున్నాడు. కానీ అవేవీ వినని ఆ ముగ్గురు అతన్ని మట్టుబెట్టారు. విజయ్‌ చనిపోయాడని నిర్ధారించుకున్నాక శవాన్ని టాయిలెట్'లో పడేసి వెళ్లిపోయారు. ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేసి, శవంపై దుస్తులను మార్చేసిన శ్రీలక్ష్మి.. భర్త గుండెపోటుతో మరణించాడని ప్రచారం చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు నిజమేననుకుని విజయ్‌ అంత్యక్రియలు జరిపించారు.

పశ్చాత్తాపపడిన నిందితుడు.. 

విజయ్‌ హత్య అనంతరం రాజేశ్వర్‌రెడ్డి వికారాబాద్‌ పారిపోయాడు. విషయం బయటకు పొక్కితే కటాకటాలు లెక్కించాల్సి వస్తుందని మూడున్నర నెలలపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. విజయ్‌ను కొడుతుండగా తనను చంపొద్దని వేడుకోవడం పదేపదే గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. దీంతో గురువారం మధురానగర్‌ ఠాణాకు వచ్చి అంతా చెప్పేశాడు. ఒక వ్యక్తిని చంపినందుకు మానసిక ప్రశాంతత కరవైందని, పశ్చాత్తాపంతో లొంగిపోతున్నట్లు చెప్పాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాజేశ్వర్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజేశ్‌, మైతాబ్‌పై హత్య కేసు నమోదు చేశారు.
Comments
 -Advertisement-