-Advertisement-

వాటర్ ట్యాంక్ లో కుళ్లిన శవం.. వారం రోజుల నుండి కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగిన స్థానికులు..?

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నల్గొండ: నల్గొండ మున్సిపాలిటీలోని 11వ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం తేలింది. వాటర్‌ ట్యాంక్‌లో అనుమానాప్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. తనిఖీల్లో భాగంగా అధికారులు వాటర్ ట్యాంకులో నీళ్లు చెక్‌ చేసేందుకు వెళ్లగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవం కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి, ట్యాంకును శుభ్రం చేయించారు. తమకు తెలియకుండానే గత 10 రోజులుగా కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగామా అని స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

వాటర్‌ ట్యాంక్‌లో కనిపించిన శవం హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు గత పది రోజుల నుంచి కనిపించకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అయితే అతడు తనకు తానుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నా డా? లేదా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా? లేదంటే మరెవరైనా హత్య చేసి శవాన్ని అందులో పడేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు అది మంచినీళ్ల ట్యాంక్‌ కావడంతో గత పది రోజులుగా మున్సిపాలిటీలోని ప్రజలంతా అవే నీళ్లు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మంచినీళ్ల ట్యాంకులో శవం తేలడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కలుషితాన్ని అరికట్టేందుకు, నీటి సరఫరాకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.
Comments
 -Advertisement-