-Advertisement-

భారీ గుంతలు.. ప్రమాదాలకు నెలవులు..

Vaasthava Nestham

- మృత్యుఘటికలుగా మారుతున్న స్టోన్ క్రషర్ గుంతలు 
-వారం రోజుల్లో ఇద్దరు మృతి 
- నిబంధనలు తుంగలో తొక్కుతున్న స్టోన్ క్రషర్ నిర్వహకులు
- నిబంధనలు పాటించకపోవడంతోనే మరణాలు అంటూ ప్రజల ఆగ్రహం 
- పట్టించుకోని మైనింగ్ శాఖ అధికారులు


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: జిల్లా వ్యాప్తంగా స్టోన్ క్రషర్ల యజమానులు బండరాళ్ల తరలింపుకోసం క్వారీల వద్ద భారీ గుంతలు తవ్వుతున్నారు. బండరాళ్లను తీసి గుంతలను అలాగే వదిలేస్తున్నారు. ఈ గుంతలే మృత్యుఘటికలుగా మారుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పెద్ద బండరాళ్ల కోసం పెద్దపెద్ద గుంతలు తీసి అలాగే వదిలేయడంతో వర్షాకాలంలో నీరు నిలిచి మనుషులకే కాకుండా పశువులు మృతి చెందుతున్నాయి. జిల్లాలోని బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామ శివారులో ఉన్న స్టోన్ క్రషర్ యజమాన్యాలు బండరాళ్ల కోసం తీసిన గుంతలో వారం రోజుల వ్యాధిలో గుంతల్లో పడి ఇద్దరు మృతి చెందారు. బండరాళ్ల కోసం తవ్విన పెద్ద పెద్ద గుంతలను మట్టితో లేదా ఇసుకతో పూడ్చాలి, లేదా గుంతల చుట్టూ కంచే ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నా కూడా ఈ నిబంధన పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల్లో ఇద్దరు మృతి..


మండలంలోని పిప్రి గ్రామంలో స్టోన్ క్రషర్ గుంతలో చత్తీస్గడ్ నుండి వలసగా కూలీలుగా వచ్చిన మండరి భారత్, గాయత్రీ  కుటుంబానికి చెందిన కలిశ్వరి, సంజన ఇద్దరు కుమార్తెలు రోజు మాదిరిగా పక్కనే వున్నా క్రేషర్ వద్ద తవ్విన క్వారీ గుంతలో స్నానానికి వెళ్లగా.. చిన్న కుమార్తె సంజనకు పిడ్స్ వచ్చి గుంతలో పడి మృతి చెందింది. మండలంలోని వర్తమన్నూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు పిప్పిరి గ్రామ పరిధిలోని స్టోన్ క్రషర్ యజమానులు తవ్విన భారీ నీటి గుంతలో గణపతి నిమర్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.

ఇష్టారీతిన వ్యవహరిస్తూ..


జిల్లావ్యాప్తంగా క్రషర్ నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. క్వారీలు ఉన్న ప్రాంతాల్లో నిబంధనల పేరిట లైసెన్సులు తీసుకుని అసైన్డ్ భూములు, వక్సూములు, ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా క్వారీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో బండరాళ్లను వెలికి తీసి క్రషర్లకు తరలిస్తున్నారు. సమీపభూ యజమానులకు ఎంతోకొంత ముట్టజెప్పి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మైనింగ్ శాఖ అధికారులు క్రషర్లకు అనుమతులు ఇచ్చిన క్వారీలో బ్లాస్టింగ్ చేసేందుకు పోలీసు, రెవెన్యూశాఖ అనుమతులు తీసుకోవాలి. కానీ.. క్రషర్ యజమానులు తమ పలుకుబడితో క్రషర్ల నిర్వహణ చేపడుతూ జిల్లా ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చూస్తున్నారు. వరస మరణాలు జరుగుతున్న కూడా మైనింగ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
 -Advertisement-