వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : స్నేహితుని నమ్మి ఓ డాక్టర్ క్రిప్టో (cryptocurrency) కరెన్సీలో పెట్టుబడి పెట్టాడు. తీరా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పనిచేసే వైద్య వృత్తిలో అనస్తీషియా Anaesthesia (మత్తు ) డాక్టర్ గా పనిచేస్తున్న ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మంకమ్మతోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్ గా పనిచేశాడు. శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడం కోసం బ్యాంకు నుండి రుణాలు తీసుకున్నాడు. తరచూ బ్యాంక్ అధికారులు ఇంటికి రావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితులతో కలిసి మెటా ఫండ్ లో డబ్బులు పెట్టాడని, కరుణాకర్, కిరణ్, గణేష్ అనే స్నేహితులకు కోట్లలో డబ్బులు ఇచ్చాడని భార్య ఆరోపించారు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగుల వేధింపులు, స్నేహితులు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు బందువులు తెలిపారు. పలురకాల బిజినెస్ లలో గణేష్, కిరణ్, కరుణాకర్ లు శ్రీనివాస్ తో డబ్బులు పెట్టించి మోసం చేశారని ఆరోపించారు. వైద్యవృత్తిలో ఉండడంతో బ్యాంక్ రుణాలు తీయించారని చెప్పారు. సుమారు మూడు కోట్ల రూపాయల వరకు అప్పులు అయినట్లు తెలిపారు. గత పదేళ్లుగా ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

