వాస్తవ నేస్తం,ఢిల్లీ : బ్యాంకు ఖాతాదారులు ఇక నుండి నలుగురేసి నామినీలను నియమించుకోవచ్చు. ప్రస్తుతం ఒకరినే బ్యాంకు ఖాతాకు నామినీగా నియమించే అవకాశం ఉంది. అయితే నలుగురు నామినీలను నియమించుకునే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన నిబంధనలు నవంబర్ 1 నుండి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టం ఈ ఏడాదిలో చేసిన మార్పుల వలన నామినేషన్కు సంబంధించిన కీలక నిబంధనలు నవంబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాను తెరిచే సమయంలోనే ఖాతాదారుడి మరణానంతరం డబ్బును ఎవరికి చెల్లించాలనే విషయం చెప్పాల్సి ఉంటుంది. అయితే అది ఒకరిని మాత్రమే నామినీగా నియమించే అవకాశం ఉండేది. ఇక నుండి నలుగురిని పెట్టుకునేలా చట్ట సవరణ చేశారు. నామినీలను ఒకేసారి గానీ, ప్రాధాన్యతల ఆధారంగా గాని నియమించుకోవచ్చు. ఖాతాలో ఉన్న నగదు మొత్తంలో ఎవరికి ఎంత చెందాలో కూడా పేర్కొనవచ్చు. ఇది మొదటిది. అంతే కాకుండా నామినీలుగా పేర్కొన్న వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మరణిస్తే.. రెండో వ్యక్తికి, రెండో వ్యక్తి మరణిస్తే.. మూడో వ్యక్తికి , ఇలా నగదు పొందేలా ఏర్పాటు చేసుకోవడం రెండవది. లాకర్లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.
