• పెన్షన్ డబ్బులు, ఆస్తి వివాదం నేపథ్యంలో దారుణం
• హత్యను ప్రమాదకంగా చిత్రకరించేందుకు మృతదేహంపై నూనె పోసి నిప్పంటించిన కొడుకు
వాస్తవ నేస్తం,కోటగిరి : మద్యం మత్తు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కాలయముడై కన్నతల్లిని హతమార్చిన ఘటన నిజాంబాద్ జిల్లాలోని కోటగిరి గ్రామంలో కలకలం రేపింది. పెన్షన్ డబ్బులు, ఆస్తి వివాదం ఈ దారుణానికి కారణమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గ్రామానికి చెందిన పద్మశాలి మానాజీ (45) మద్యానికి బానిసయ్యాడు. తన తల్లి పద్మశాలి భూమవ్వ (70)కు వచ్చే వృద్ధాప్య పెన్షన్ డబ్బులు, అలాగే ఉన్న ఇంటిని అమ్మాలని నిత్యం ఒత్తిడి తెచ్చేవాడని స్థానికులు తెలిపారు. ఈ విషయమై తరచూ తల్లి–కొడుకుల మధ్య ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం.
శుక్రవారం రాత్రి సమయంలో మళ్లీ ఇదే అంశంపై వాగ్వాదం చెలరేగింది. మద్యం మత్తులో ఆవేశానికి లోనైన మానాజీ, ఇంట్లో ఉన్న ఖాళీ మద్యం సీసాతో తల్లి తలపై బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రోకలి కర్రతో మరికొన్ని సార్లు దాడి చేయడంతో భూమవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.
హత్యను ప్రమాదంలా చూపించేందుకు అర్థరాత్రి సమయంలో మృతదేహంపై దీపం నూనె పోసి నిప్పంటించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో మృతురాలి మెడ భాగం, కాళ్లు మోకాళ్ల వరకు కాలిపోయాయి. మృతురాలి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్థానిక ఎస్సై సునీల్ తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించగా, మద్యపాన దుష్ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

