మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది వేగవంతమైన నిర్ణయాలు, దూకుడు రాజకీయాలు, స్పష్టమైన లక్ష్యం. ‘దాదా’గా ప్రసిద్ధి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం సాధారణం కాదు. దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడిగా, ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అరుదైన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. అయినప్పటికీ, అత్యున్నత పదవైన ముఖ్యమంత్రి పీఠం బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతితో అందని ద్రాక్షగానే మిగిలింది.
Ajit Pawar | ఆరుసార్లు డిప్యూటీ సీఎం… ఐదుగురు సీఎంలతో పని..
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో అజిత్ పవార్ ఒక ప్రత్యేక అధ్యాయం. ఆయన ఏకంగా ఆరు సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. విలాస్రావ్ దేశ్ముఖ్, అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, ఉద్ధవ్ థాకరే, దేవేంద్ర ఫడణవీస్ ఇలా ఐదుగురు వేర్వేరు ముఖ్యమంత్రుల కింద డిప్యూటీగా బాధ్యతలు నిర్వహించడం ఆయన రాజకీయ స్థాయిని చెబుతుంది.
2019లో దేవేంద్ర ఫడణవీస్తో కలిసి రాత్రికి రాత్రే ప్రమాణ స్వీకారం చేసిన 80 గంటల ప్రభుత్వం అయినా, 2023లో ఎన్సీపీ ని చీల్చి మహాయుతిలో చేరిన నిర్ణయమైనా అజిత్ పవార్ తీసుకున్న ప్రతి కీలక అడుగు వెనుక ఒకే లక్ష్యం కనిపిస్తుంది. అదే ముఖ్యమంత్రి పీఠం. అయితే రాజకీయ సమీకరణలు, పార్టీ అంతర్గత సమీకరణలు ఆయనను ఎప్పుడూ ‘నెంబర్ టూ’ స్థానానికే పరిమితం చేశాయి.
పరిపాలనలో కఠిన నిర్ణయాల నాయకుడు..
అజిత్ పవార్ను కేవలం రాజకీయ నేతగా చూడడం సరిపోదు. పరిపాలనలో ఆయనను ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్గా అధికారులు, రాజకీయ వర్గాలు అంగీకరిస్తాయి. నీటి పారుదల శాఖ, ఆర్థిక శాఖ, విద్యుత్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక విభాగాలను ఆయన నిర్వహించారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం ఉండదన్న పేరుంది.
సొంత నియోజకవర్గం బారామతిని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ ఆధునీకరణ ఈ అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా గుర్తింపు పొందాయి. బ్యూరోక్రసీపై ఆయనకున్న పట్టు, ఫైళ్లపై చూపే వేగం ఆయన ప్రత్యేకతగా నిలిచాయి.
శరద్ పవార్ నీడ నుంచి బయటపడాలన్న ప్రయత్నం..
తన బాబాయి శరద్ పవార్ రాజకీయ వారసత్వం నుంచి బయటపడి, సొంత గుర్తింపు సంపాదించుకోవాలన్న తపన అజిత్ పవార్లో ఎప్పుడూ కనిపిస్తుంది. “నేను ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను” అన్న మాటను ఆయన బహిరంగంగానే పలికిన సందర్భాలున్నాయి. అదే సమయంలో ఆ ఆకాంక్షే ఆయన రాజకీయ ప్రయాణంలో ఒడిదుడుకులకు కారణమైందన్న విశ్లేషణలూ ఉన్నాయి. పార్టీ విభజనలు, వ్యూహాత్మక నిర్ణయాలు, అధికార సమీకరణలుఈ అన్ని మలుపుల్లోనూ అజిత్ పవార్ కేంద్రబిందువుగా నిలిచారు. కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఎప్పుడూ ఒక అడుగు దూరంలోనే ఆగిపోయింది.

కుటుంబం, క్యాడర్, రాజకీయ వారసత్వం..
వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్కు భార్య సునేత్ర పవార్, కుమారులు జై పవార్, పార్థ్ పవార్ ఉన్నారు. రాజకీయ ఒడిదుడుకుల్లో కుటుంబం ఆయనకు బలంగా అండగా నిలిచింది. క్యాడర్లో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ ఆయన ప్రజా సమస్యలపై చూపే నిబద్ధతకు నిదర్శనం.
ముఖ్యమంత్రి కాలేకపోయినా, అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభావవంతమైన అధ్యాయాన్ని రాశారు. అధికారం కంటే పరిపాలనలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. సీఎం పీఠం దూరమైనా, ‘దాదా’గా ఆయన స్థానం మాత్రం రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team,Published: January 29, 2025 | 09:39 AM
