• థలసేమియా బాలిక చికిత్సకు తనవంతు సాయం
వాస్తవ నేస్తం,అదిలాబాద్: జిల్లా కలెక్టర్ రాజార్షి షా మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలిక చికిత్సకు అవసరమైన ఆర్థిక సాయాన్ని తన సొంత ఖర్చుల నుంచి అందజేశారు. ఇచ్చోడ మండలం ముఖ్ర (బి) ( Ichoda Mandal Mukhra-B Village ) గ్రామానికి చెందిన మోహితె శివాంగి అనే 10 సంవత్సరాల చిన్నారి థలసేమియా వ్యాధితో బాధపడుతూ, చిన్న వయసులో బోన్ మరో సర్జరీ ఉన్నందున ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆ చిన్నారికి త్వరలో అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ విషయం, ఆపరేషన్కు అయ్యే ఖర్చుల గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజార్షి షా తక్షణమే స్పందించారు.
చిన్నారి చికిత్స నిమిత్తం తన సొంత నిధుల నుంచి రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో శివాంగి తాతయ్య, నానమ్మలను కలెక్టర్ ఆహ్వానించారు. వారిని పరామర్శించి, ఈ మొత్తాన్ని వారికి అందజేశారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా, జిల్లా కలెక్టర్ చూపిన ఔదార్యం పట్ల శివాంగి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

