వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో కొనుగోలు విషయంలో ప్రజల ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఆభరణాల కొనుగోలుపై ఆసక్తి చూపిన వినియోగదారులు.. ఇప్పుడు పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
బంగారంపై పెట్టుబడులు ఏకంగా 40 శాతం పెరిగాయని అంచనాలు వెల్లడిస్తున్నాయి. అయితే అదే సమయంలో
2025 మొదటి తొమ్మిది నెలల్లో దేశీయంగా మొత్తం బంగారం డిమాండ్ 14 శాతం తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.
అంటే కొనుగోలు తగ్గినా.. పెట్టుబడి ధోరణి మాత్రం బలపడినట్టు స్పష్టమవుతోంది.
మారిన కొనుగోలు తీరు | Changing Buying Trend
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు గోల్డ్ రేట్లు దాదాపు 67 శాతం పెరిగాయి. డిసెంబర్ 26న అంతర్జాతీయ మార్కెట్లో
ఔన్సుకు 4,597 డాలర్ల స్థాయికి చేరి ఆల్టైమ్ రికార్డును నమోదు చేశాయి. భారతదేశంలో మాత్రం బంగారం ధరలు
77 శాతం వరకు పెరగ్గా.. ఈ ర్యాలీ నిఫ్టీ ఇండెక్స్ ఇచ్చిన 9.7 శాతం లాభాన్ని సైతం మించిపోయింది.
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 5 శాతం పడిపోవడం కూడా బంగారం ధరల పెరుగుదలకు తోడైంది. దీంతో బంగారం కొనుగోలు సామాన్యులకి మరింత భారంగా మారింది.
ఈ పరిస్థితుల్లో బంగారు ఆభరణాలకు డిమాండ్ తగ్గింది. వాటి స్థానంలో గోల్డ్ కాయిన్స్, బార్స్ (కడ్డీలు) వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చిన్న బరువుల నాణేలు, పెట్టుబడికి అనుకూలంగా ఉండటంతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. అదే విధంగా డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా గోల్డ్ పెట్టుబడులు కూడా
వేగంగా పెరుగుతున్నాయి.
సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం కొనుగోలు చేయడం భారతీయ సంప్రదాయం. కానీ 2025లో ధరలు అతి వేగంగా పెరగడంతో ఆభరణాల కొనుగోలు తగ్గిపోయింది. మేకింగ్ ఛార్జీలు కూడా అధికంగా ఉండటంతో వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు.

అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, వాణిజ్య ఉద్రిక్తతలు, ట్రంప్ సుంకాల ప్రభావం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనత వంటి అంశాలు బంగారం ధరలను మరింత పైకి నెట్టాయి. దీని ఫలితంగా బంగారం సేల్స్ గణనీయంగా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
