- సంక్రాంతి నేపథ్యంలో చైనా మంజాపై ప్రత్యేక తనిఖీలు
- ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదు
- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
వాస్తవ నేస్తం, ఆదిలాబాద్: జిల్లా పరిధిలో చైనా మంజా పై China Manja Ban) పూర్తిగా నిషేధం ఉన్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చైనా మంజాపై నిషేధం విధించిన నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రత్యేక తనిఖీలు
రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేస్తారని తెలిపారు. ఇప్పటివరకు ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
చైనా మంజా వల్ల ప్రమాదాలు
నైలాన్, సింథటిక్ దారాలతో తయారయ్యే చైనా మంజా (China Manja Ban) పర్యావరణానికి తీవ్ర హాని కలిగించడంతో పాటు, సాధారణ ప్రజలు, వాహనదారులు, పక్షులకు ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చైనా మంజాతో గాలిపటాలు ఎగురవేసే సమయంలో గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు సైతం తీవ్రంగా గాయపడిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. ఈ కారణాల వల్లనే చైనా మంజాపై పూర్తిస్థాయి నిషేధం విధించబడిందని అన్నారు.
చట్టపరమైన చర్యలు
చైనా మంజా విక్రయాలు, వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎవరైనా చైనా మంజా విక్రయిస్తున్నట్లు లేదా వినియోగిస్తున్నట్లు గమనించినట్లయితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సోమవారం నిబంధనలు అతిక్రమించి చైనా మాంజాను అమ్ముతున్నటువంటి కూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. మూడు రోజుల్లో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసులు నమోదు అయినట్లు, ఐదు కేసులలో రూ.30 వేల విలువగల 40 చైనా మంజ చేరకాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిబంధనలకు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
