📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBreaking NewsCash Seized | ఎన్నికల చెక్‌పోస్ట్ వద్ద ₹28 లక్షల నగదు స్వాధీనం

Cash Seized | ఎన్నికల చెక్‌పోస్ట్ వద్ద ₹28 లక్షల నగదు స్వాధీనం

• రాంపూర్ ఎస్‌ఎస్‌టి తనిఖీల్లో పట్టుబడ్డ నగదు

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : జిల్లా పట్టణ శివారులోని రాంపూర్ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టి (సర్వైలెన్స్ స్క్వాడ్ టీమ్) చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా తరలిస్తున్న ₹28 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. వివరాల ప్రకారం, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ వైపు ప్రయాణిస్తున్న ఒక బస్సును రాంపూర్ చెక్‌పోస్ట్ వద్ద ఎస్‌ఎస్‌టి బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో మహారాష్ట్ర రాష్ట్రం ఉమర్కేడ్ తాలూకా ధానీ గ్రామానికి చెందిన సుభాష్ కేశవ్ జన్నావార్ అనే వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. నగదు తరలింపుకు సంబంధించిన ఎలాంటి సరైన ధ్రువపత్రాలు చూపించకపోవడంతో, ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులు మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు.

మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అక్రమంగా నగదు రవాణాను అడ్డుకునేందుకు ఎస్‌ఎస్‌టి బృందాలు 24 గంటల పాటు అప్రమత్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెక్‌పోస్ట్‌ల వద్ద వాహనాలు, బస్సులు, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నగదు, ఇతర అనుమానాస్పద వస్తువులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ తహసిల్దార్ భూష మహేష్, పోలీసు సిబ్బంది మరియు ఎస్‌ఎస్‌టి బృంద సభ్యులు పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. నగదు ఎవరి కోసం, ఏ ప్రయోజనంతో తరలిస్తున్నారన్న అంశాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను స్వచ్ఛంగా నిర్వహించేందుకు ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని జిల్లా ఎన్నికల అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page