• సర్పంచ్ ఎన్నికల్లో పంచిన డబ్బులు ఇవ్వాలంటూ కాల్స్..!?
• డబ్బులు ఇవ్వకుంటే కాంప్లెట్ చేస్తా..!
• ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి ట్విస్ట్
• ఆందోళన చెందుతున్న డబ్బులు తీసుకున్న వ్యక్తులు
• నోటుకు.. ఓటు చేటని తెలిసి కూడా ఓట్లను అమ్ముకుంటున్న వైనం
• డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తే ఇలాంటి తంటాలు తప్పవని మండలంలో జోరుగా చర్చ
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: ఓటుకు.. నోటు తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సరైనదని తెలిసి కూడా ఎంతోమంది డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారని వాదనలు లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు ముగిసాయి. గెలిచిందెవరో.. ఓడిపోయింది ఎవరు అని కూడా తేలిపోయింది. తాము ఎలాగైనా సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలని డబ్బులు పంచిన సర్పంచ్ అభ్యర్థులు ఎందరో ఓటమిపాలయ్యారు. తమ ఓటమిని, ఓట్ల కోసం తాను పంచిన డబ్బులు వృధాప్రాయస అయ్యాయని జీర్ణించుకోలేక తాము పంచిన డబ్బులు తమకి ఇవ్వాలంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కగా.. మరో సర్పంచ్ అభ్యర్థి తమ డబ్బులు తమకు ఇవ్వాలి లేదా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పండి నాకు ఓటు వైశారా లేదా అని..? ఇంటింటికి తిరుగుతున్న ఘటనలు మరవకముందే. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో అదే తరహాలో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ అభ్యర్థి ఓట్ల కోసం తాను పంచిన డబ్బులు ఇవ్వాలంటూ కాల్స్ చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నా డబ్బులు.. నాకు ఇవ్వండి.. లేదా కంప్లైంట్ చేస్తానని అనడం ఇప్పుడు మండల వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి దగ్గర డబ్బులు తీసుకున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓటుకు నోటు చేటు.. ఓటును అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని అధికారులు అవగాహన కల్పిస్తున్న కూడా.. ఇలాంటి ఘటనలు జరగడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.
