వాస్తవ నేస్తం,న్యూఢిల్లీ :దేశీయబులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి సంచలన స్థాయికి చేరాయి. శుక్రవారం ఒక్కరోజులోనే వెండి ధర కిలోకు రూ.4,000 పెరిగి ఢిల్లీలో రూ.2,41,400కు చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం.
అదే సమయంలో బంగారం ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 ఎగిసి రూ.1,39,440గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.1,140 పెరిగి రూ.1,36,200గా కొనసాగుతోంది.
ఇక 22 క్యారెట్ (99.5 శాతం స్వచ్ఛత) బంగారం ధర కూడా రూ.1,050 పెరిగి 10 గ్రాములకు రూ.1,24,850గా ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ఔన్స్ ధర 67.47 డాలర్లు పెరిగి 4,392.94 డాలర్లకు చేరింది. సిల్వర్ ఔన్స్ ధర 74.52 డాలర్లుగా నమోదైంది.
దేశీయంగా వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్తో పాటు పెట్టుబడిదారుల ఆసక్తి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సౌర విద్యుత్ రంగాల్లో వెండి వినియోగం పెరగడం ధరలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషిస్తున్నారు.
గత ఏడాది వెండి ధర కిలోకు ఏకంగా రూ.1,49,300 పెరగడం విశేషం. అదే సమయంలో బంగారం ధర కూడా తులానికి రూ.58,750 వరకు పెరిగింది. ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో బులియన్ మార్కెట్ మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా.