అక్టోబరు 30, 1883న అజ్మీర్లో మహాసమాధి పొందిన ఆర్యసమాజ్ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జీవితం, హిందూ ధర్మ పునరుజ్జీవనానికి, సామాజిక సంస్కరణలకు, జాతీయోద్యమానికి అద్దం పడుతుంది. ఆయన 1824 ఫిబ్రవరి 12న గుజరాత్లోని టంకారా (మొర్బీ జిల్లా) లో ఓ సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కర్షన్జీ లాల్జీ తివారీ ధనికుడు, ఆడిటర్గా పనిచేసేవారు. బాల్యం నుంచే శివభక్తుడైన మూలశంకర్, 14 ఏళ్ల వయసులో శివరాత్రి రోజు ఆలయంలో ఉన్న శివలింగం మీద ఎలుకలు ఆడుకోవడం చూసి, మూఢవిశ్వాసాలపై సందేహం కలిగింది. ఇది ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
బాల్యం మరియు సన్యాస దీక్ష :
దయానంద సరస్వతి తండ్రి తెచ్చిన వివాహ ప్రస్తావనను తిరస్కరించి, సంసార బంధాలు ఆత్మజ్ఞానానికి అడ్డు అని భావించి 19 ఏళ్ల వయసులో (1843) ఇంటి నుంచి పారిపోయారు. గురువు శోధన కోసం హిమాలయాలు, వింధ్య పర్వతాలు, అవధ్, గుజరాత్ ప్రాంతాల్లో సంచరిస్తూ యోగులు, సాధువులను కలిసి వేదాంతం, యోగం నేర్చుకున్నారు. స్వామి పూర్ణానంద ను 1845లో గురువుగా ఎంచుకుని, యోగ సాధనలో ప్రావీణ్యం సాధించారు. ఆ తరువాత 1860 లో దండీ స్వామి విర్జానంద మథురాలో కలిసి, వేదాలు, సంస్కృత వ్యాకరణం వారినుండి నేర్చుకున్నారు. గురువు ఆదేశంతో మూఢాచారాలను వ్యతిరేకించి, వేద ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇక్కడే “దయానంద సరస్వతి” అనే పేరు స్వీకరించారు.
మూఢాచారాలను వ్యతిరేకించి, వేద ప్రచారం చేయాలని నిర్ణయించి సంస్కరణల కోసం ఆర్యసమాజ్ స్థాపన చేసారు. వారి మొదటి ప్రసంగం 1869లో కాశీలో హిందూ-ముస్లిం -క్రైస్తవ మతాల మధ్య వాదనలో పాల్గొని, వేదాల ఆధారంతో హిందూ ధర్మాన్ని రక్షించె సందర్బంగా చేసారు. ఇది ఆయన ఖ్యాతిని పెంచింది. మూఢాచార వ్యతిరేకత కోసం బాల్యవివాహాలు, బహుభార్యత్వం, విగ్రహారాధన, జాతి వివక్షను తీవ్రంగా అడ్డుకున్నారు. “వేదాలకు తిరిగి వెళదాం ” (Back to Vedas) అనే నినాదం ఇచ్చారు. ఆర్యసమాజ్ ను 1875 ఏప్రిల్ 10న బొంబాయిలో స్థాపించారు. 1883 నాటికి లక్షల మంది అనుయాయులు వారిని అనుసరించారు. లక్నో, లాహోర్, ఢిల్లీ వంటి చోట్ల చాలా శాఖలు విస్తరించాయి.
ముఖ్య సంస్కరణలు :
శుద్ధి ఉద్యమం : ముస్లిం, క్రైస్తవ మతాంతరీకరణలను ఎదుర్కొని, హిందూ మతంలోకి తిరిగి చేర్చే కార్యక్రమం.
విద్యావ్యాప్తి : గురుకుల విద్యా విధానం ప్రవేశపెట్టి, ఆంగ్ల విద్యతో పాటు వేదాలు బోధించే పాఠశాలలు స్థాపించారు (డీఏవీ స్కూల్స్ మూలం).
మహిళా హక్కులు : వితంతు పునర్వివాహం (నియోగ విధానం), స్త్రీ విద్యను ప్రోత్సహించారు.
1857 స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ పాత్ర వహించారు. 1857 మే 29న మేరఠ్లో సైనికులతో రహస్య సమావేశం నిర్వహించి, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటును ప్రేరేపించారు. “స్వరాజ్యం” అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వారిలో దయానంద సరస్వతి ఒకరు. నానా సాహెబ్, తాంతియా తోపే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వంటి యోధులకు ఆయన ఆధ్యాత్మిక, దేశభక్తి ప్రసంగాలు ప్రేరణగా నిలిచాయి. ఆయన “స్వధర్మం, స్వభాష, స్వదేశం” అనే త్రివిధ సూత్రం జాతీయోద్యమానికి బీజం వేసింది.
దయానంద సరస్వతి రచనలు :
1) సత్యార్థ ప్రకాశ్ (1875) : ఆయన ముఖ్య గ్రంథం. హిందూ ధర్మం, ఇతర మతాల విమర్శ, సామాజిక సంస్కరణలపై వివరణ.
2) ఇతరాలు: ఋగ్వేదాది భాష్య భూమిక, ఋగ్వేద భాష్యం, యజుర్వేద భాష్యం మొదలైనవి. హిందీ, సంస్కృతంలో రచనలు.
1883, 29న సెప్టెంబరు జోధ్పూర్ మహారాజా ఆస్థానంలో నృత్యకారిణి నాన్హీ జాన్తో సంబంధం ఉన్న వంట వాడు జగన్నాథ్ చేత దయానంద సరస్వతి మీద విషప్రయోగం జరిగింది. 32 రోజులు బాధలు పడి, అక్టోబరు 30న అజ్మీర్లో మహాసమాధి పొందారు. చావు ముందు “ఈశ్వరుడు నన్ను రక్షించాలి, దేశం శత్రువుల నుంచి రక్షించబడాలి” అని ప్రార్థించారు. స్వామి దయానందుడు అజ్ఞానం, దారిద్య్రం, అన్యాయాలపై పోరాడి, హిందూ సమాజాన్ని ఏకం చేశారు. ఆయన స్ఫూర్తి ఈనాటికీ ఆర్యసమాజ్, డీఏవీ విధ్యా సంస్థల ద్వారా కొనసాగుతోంది.
సేకరణ : Mohammed Ghouse
