వాస్తవ నేస్తం | ఆదిలాబాద్ వార్తలు | 12 నవంబర్ 2025
- లేగ దూడపై దాడి
- భయాందోళన చెందుతున్న ప్రజలు
- లేగ దూడపై దాడి చేసింది పెద్దపులి అని నిర్ధారించిన అటవిశాఖ అధికారులు
ఆదిలాబాద్ జిల్లా: బోథ్ మండల అడవి ప్రాంతంలో ఇటీవల ఆవులపై పెద్దపులి దాడి చేసిన ఘటనలు మరువకముందే,
ఇప్పుడు సిరికొండ మండలంలో పెద్దపులి లేగ దూడపై దాడి చేయడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
సిరికొండ మండలం సాత్ మోరి గ్రామం పరిసరాల్లో జరిగిన ఈ ఘటనలో, పెద్దపులి లేగ దూడపై దాడి చేసి చంపేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దాడి తర్వాత సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లడానికి భయపడుతున్నారు.
అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల నమూనాలు సేకరించారు. వీటి ఆధారంగా దాడి చేసినది పెద్దపులి (Tiger) అని అధికారికంగా నిర్ధారించారు.
ప్రజలకు అటవీశాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. పశువులను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లరాదని,
వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా గుంపుగా వెళ్లాలని సూచించారు.
అదేవిధంగా అడవి పందుల నుండి పంటలను కాపాడేందుకు విద్యుత్ కంచెలు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశువుల యజమానులు జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
