ఎర్రకోట దద్దరిల్లిన విస్ఫోటనం – రాజధాని భయాందోళనలో
న్యూఢిల్లీ, నవంబర్ 11 (వాస్తవ నేస్తం): దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం బీభత్సానికి వేదికైంది.
ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన కారులో సంభవించిన శక్తివంతమైన పేలుడుతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనతో రాజధాని మొత్తం ఉలిక్కిపడగా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసింది.
ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్లలో హై అలర్ట్ ప్రకటించడంతో ప్రధాన నగరాలు రక్షణ వలయాల్లోకి వెళ్లాయి.
పేలుడు వార్త వెలువడిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
వెంటనే హోంమంత్రి ఢిల్లీ పోలీసు కమిషనర్ సతీశ్ గొల్చా, ఐబీ చీఫ్ తపన్ డేకా, ఎన్ఐఏ డీజీ సదానంద్ వసంత్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఎన్ఐఏ ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు స్వరూపం, ఉగ్రవాద కోణాలను విశ్లేషిస్తున్నాయి.
స్థానిక పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సమగ్ర విచారణలో నిమగ్నమయ్యాయి.
ఎర్రకోట పరిసర ప్రాంతం ఎప్పుడూ జనసంచారం ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడింది.
అయినప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి.
గాయపడిన వారిని సమీప ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు.
కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం సహా పలు కీలక ప్రదేశాల్లో
భద్రతను మరింత బలోపేతం చేశారు.
సోషల్ మీడియాలో ఈ దాడి వెనుక ఉగ్రవాదుల చేతులున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అధికారిక ప్రకటన రానప్పటికీ, అదే రోజు ఉదయం జరిగిన ఒక పెద్ద ఆపరేషన్ ఈ దర్యాప్తుకు కొత్త మలుపు తెచ్చింది.
ఫరీదాబాద్లో జమ్మూకశ్మీర్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో
జైషే మహ్మద్ (JeM),
అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ సంస్థలకు చెందిన ఏడుగురు తీవ్రవాదులను అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, ఏకే–47లు, పిస్టళ్లు, టైమర్లు స్వాధీనం కావడం దేశ భద్రతా సంస్థల్లో ఆందోళనకు దారితీసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ఒక్కరోజు ముందు ఢిల్లీలో జరిగిన ఈ పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన పరిస్థితులను సృష్టించింది.
కీలక రాజకీయ సమయాల్లో ఉగ్రవాద శక్తులు రుగ్మతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్న భావన మరోసారి బలపడింది.
దాడి నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు ఉగ్రవాద సంబంధాలు, కుట్రలు, దేశాన్ని అస్థిరపరిచే శక్తుల పాత్రపై ముమ్మరంగా పరిశీలిస్తున్నాయి.
