వాస్తవ నేస్తం,న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ బంగారం, వెండి మార్కెట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025 ముగిసే సమయానికి ఈ విలువైన లోహాలు చరిత్రలోనే అరుదైన రికార్డులను నమోదు చేయడంతో, పెట్టుబడిదారుల చూపు మరింత బలంగా వాటిపైనే నిలిచింది.
గత ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 66 శాతం వరకు పెరిగి, గత ఐదు దశాబ్దాల్లోనే అత్యధిక లాభాన్ని అందించింది. అదే సమయంలో వెండి ధరలు 157 శాతం కంటే ఎక్కువగా ఎగబాకి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం వంటి అంశాలు ఈ లోహాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నిపుణుల అంచనాల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర 5,000 డాలర్ల స్థాయిని చేరే అవకాశం ఉంది. భారత మార్కెట్లో తులం బంగారం ధర రూ.1.50 లక్షల నుంచి
రూ.1.65 లక్షల వరకు వెళ్లవచ్చని అంచనా. ఇదే సమయంలో వెండికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో విస్తృత వినియోగం కారణంగా వెండి ధరలు కొత్త గరిష్టాలను తాకవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

2026లో కిలో వెండి ధర రూ.2.40 లక్షల నుంచి రూ.2.75 లక్షల వరకు చేరవచ్చని అంచనా వేస్తుండగా, కొందరు నిపుణులు రూ.4 లక్షల మార్కును కూడా తోసిపుచ్చడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో బంగారం, వెండిలో 50:50 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టడం సమతుల్యమైన వ్యూహమని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.

