వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకుంటూ మార్కెట్లలో హాట్టాపిక్గా మారాయి. గత కొద్ది నెలల్లోనే గోల్డ్ రేట్లు లక్షన్నర రూపాయల స్థాయిని దాటి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ ర్యాలీ ఇక్కడితో ఆగేలా లేదని, రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, సెంట్రల్ బ్యాంకుల విధానాలు బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 2026 చివరి నాటికి గోల్డ్ రేట్లు కొత్త రికార్డుల దిశగా ప్రయాణించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆల్టైమ్ హైలను నమోదు చేయడం పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
గత ఏడాది బంగారం ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగి చరిత్ర సృష్టించాయి. ఈ ట్రెండ్ను గమనిస్తే 2026లో కూడా పసిడి రేట్లు పెరుగుతూనే ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని మార్కెట్ విశ్లేషణల ప్రకారం తులం బంగారం ధర రూ.2 లక్షల మార్క్ను తాకే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే భారీ పెరుగుదలగా భావిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా అదే దారిలో కదులుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.2.50 లక్షల పరిధిలో కొనసాగుతుండగా, 2026 చివరి నాటికి రూ.3 లక్షలు దాటే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ర్యాలీని గమనిస్తే ధరలు తగ్గే అవకాశం తక్కువగానే ఉందని వారు విశ్లేషిస్తున్నారు.
మరికొందరు మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం 2026 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.7 లక్షల స్థాయికి చేరుకోవచ్చు. అలాగే కేజీ వెండి ధర రూ.2.6 లక్షల వరకు వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, డాలర్ బలహీనపడటం, ప్రపంచవ్యాప్తంగా బంగారంపై పెరుగుతున్న పెట్టుబడులే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
వెండి విషయంలో డిమాండ్ కీలక పాత్ర పోషిస్తోంది. వెండి ఉత్పత్తి పరిమితంగా ఉండగా, డిమాండ్ మాత్రం వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, ఆధునిక టెక్నాలజీ పరికరాల్లో వెండి వినియోగం భారీగా పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో వెండి ధరలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టేవారికి రాబోయే కాలంలో మంచి లాభాలు కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే అతిగా అంచనాలు వేసుకోకుండా, మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ దశలవారీగా పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,35,820గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,500 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో కేజీ వెండి ధర రూ.2.57 లక్షల స్థాయిలో ఉంది. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలపై ఆసక్తి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
– Qamar SD

