వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు ఇక తగ్గుతాయా.? లేక ఇదే ర్యాలీ కొనసాగుతుందా.? అంతర్జాతీయ పరిణామాలతో విలువైన లోహాల మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. వెనిజులాపై అమెరికా దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సేఫ్ హెవెన్గా భావించే బంగారం, వెండి వైపు పెట్టుబడిదారుల దృష్టి మళ్లింది.
ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా దేశీయ రిటైల్ మార్కెట్లపై పడుతోంది. గోల్డ్, సిల్వర్తో పాటు కాపర్, క్రూడ్ ఆయిల్ ధరలు కూడా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల ఆభరణాల కొనుగోలుదారులు ఆలోచనలో పడుతున్నారు.
జనవరి 7న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గత రోజుతో పోలిస్తే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముకు రూ.66 పెరిగింది. తాజా పెరుగుదలతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,948 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,785గా నమోదైంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే కొనుగోలుదారులకు నిజంగా షాక్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా సమస్యలు, పెరుగుతున్న జియోపాలిటికల్ టెన్షన్స్ కారణంగా వెండి ర్యాలీ ఆగడం లేదు. బుధవారం ఒక్కరోజులోనే వెండి ధర కేజీకి ఏకంగా రూ.10,000 పెరగడం గమనార్హం.
తాజా ధరల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన వెండి కేజీ ధర రూ.2,83,000గా ఉంది. అంటే గ్రాము వెండి ధర రూ.283 వద్ద కొనసాగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తమ ప్రాంతాల్లోని తాజా రిటైల్ ధరలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు మరింత తీవ్రతరం అయితే బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
Author: QAMAR SD

