వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఇప్పటి వరకు బంగారం, వెండి ధరల గురించే చర్చ. మార్కెట్ ఎలా ఉన్నా, పెళ్లిళ్లు వచ్చినా, పెట్టుబడులు పెట్టాలన్నా భారతీయుల దృష్టి ఎప్పుడూ గోల్డ్పైనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయ ఆలోచనకు పోటీగా మరో మెటల్ నెమ్మదిగా ముందుకు వస్తోంది.
అదే లిథియం. ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరగడంతో పాటు రాగి డిమాండ్ కూడా బాగా పెరిగింది. కానీ వీటన్నింటికీ భిన్నంగా, భవిష్యత్తు అవసరాలపై ఆధారపడి లిథియంకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ లోహం ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
లిథియం అంటే బ్యాటరీలు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు అది కేవలం మొబైల్ లేదా ల్యాప్టాప్ వరకే పరిమితం కాదు. ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ స్టోరేజ్, టెక్నాలజీ రంగం అన్నింటికీ లిథియం కీలకంగా మారుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ, లిథియం అవసరం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.
పాత బ్యాటరీలతో పోలిస్తే లిథియం బ్యాటరీలు వేగంగా ఛార్జ్ అవుతాయి, ఎక్కువ సామర్థ్యం ఇస్తాయి. అందుకే టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్తే, లిథియం డిమాండ్ కూడా అంతే పెరుగుతుందన్నది నిపుణుల అంచనా. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో లిథియం ధరలు క్రమంగా ఎగబాకుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే లిథియం నిల్వలపై దేశాల మధ్య పోటీ మొదలైంది. ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా వంటి దేశాలు ఇప్పటికే ఈ రంగంలో ముందున్నాయి. ఇదే సమయంలో భారత్ కూడా లిథియంపై దృష్టి పెంచింది. దేశంలో లిథియం నిల్వల కోసం అన్వేషణ ప్రారంభించింది. విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకోవడం, క్లీన్ ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తోంది.

బంగారం, వెండి లాంటి సంప్రదాయ లోహాలు ఇప్పటికీ ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో లిథియం భవిష్యత్తు మెటల్గా మారే అవకాశాన్ని మార్కెట్ వర్గాలు కొట్టిపారేయడం లేదు. టెక్నాలజీ, ఎనర్జీ రంగాల్లో మార్పులు కొనసాగితే, లిథియం కథ ఇంకా మొదటిదశలోనే ఉందని చెప్పవచ్చు.
– QAMAR SD

