e-paper
Thursday, January 8, 2026
HomeBusinessZero-Interest Gold Loan Offer | జీరో వడ్డీ గోల్డ్ లోన్ అంటారు… చివరికి బంగారం,...

Zero-Interest Gold Loan Offer | జీరో వడ్డీ గోల్డ్ లోన్ అంటారు… చివరికి బంగారం, డబ్బు రెండూ మాయం! బి కేర్ఫుల్..

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: “వడ్డీ లేకుండా గోల్డ్ లోన్ ఇస్తాం” అనే మాట వినగానే ఎవరికైనా ఆశ కలగడం సహజం. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు, పేపర్ వర్క్ లేదు, వెంటనే నగదు అంటూ వినిపించే ఈ ఆఫర్లు చాలామందిని ఆకర్షిస్తున్నాయి. కానీ ఈ మాటలు నమ్మి ముందడుగు వేస్తే, చివరికి చేతిలో ఉన్న బంగారం కూడా పోయే ప్రమాదం ఉందని తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.

సమాజంలో మోసగాళ్లు రోజుకో కొత్త రూపంలో బయటపడుతున్నారు. సామాన్య ప్రజలే కాకుండా, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు కూడా వీరి వలలో పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు హెచ్చరిస్తున్నా, ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగేలోపే నేరగాళ్లు మరో కొత్త పద్ధతితో రంగంలోకి దిగుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘వడ్డీ లేని గోల్డ్ లోన్’ మోసం దీనికి నిదర్శనంగా మారింది.

కేరళలో ఈ ఘటన బయటపడిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇప్పటివరకు 30 మందికి పైగా బాధితులను మోసం చేసి రూ.3 కోట్లకు పైగా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. బంగారం అంటే భద్రతకు ప్రతీకగా భావించే ప్రజల నమ్మకాన్నే ఆయుధంగా చేసుకుని ఈ మోసాలు జరిగాయి.

సాధారణంగా అవసరం వచ్చినప్పుడు బ్యాంకు లేదా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలో బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం చాలా మందికి తెలిసిన ప్రక్రియ. అయితే ఇదే అలవాటును అవకాశంగా మార్చుకున్న మోసగాళ్లు “బ్యాంకుల కంటే సులువు”, “ఎలాంటి వడ్డీ లేదు”, “డాక్యుమెంట్స్ అవసరం లేదు” అంటూ అమాయకులను నమ్మిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్న వ్యాపారులు, అత్యవసర ఆర్థిక అవసరాల్లో ఉన్న కుటుంబాలే వీరి ప్రధాన లక్ష్యంగా మారుతున్నారు.

కన్నూర్ జిల్లాకు చెందిన ఓ మహిళకు కుటుంబ అవసరాల కోసం డబ్బు అవసరమైంది. స్థానికంగా పరిచయం ఉన్న వ్యక్తి చెప్పిన మాటలు నమ్మిన ఆమె రూ.2.30 లక్షల లోన్ కోసం 62.300 గ్రాముల బంగారాన్ని అప్పగించింది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో మరో రూ.1.25 లక్షలు నగదుగా కూడా ఇచ్చింది. మొదట్లో నమ్మకంగా మాట్లాడిన ఆ వ్యక్తి, కొద్ది రోజుల్లోనే ఫోన్లు ఎత్తడం మానేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

పోలీసుల విచారణలో ఈ మోసం ఒక్క ఘటనకే పరిమితం కాదని తేలింది. మహ్మద్ షిబిల్ అనే వ్యక్తి ఓ సంస్థ పేరుతో ఈ వ్యవహారం నడుపుతూ, మరికొందరు సహచరులతో కలిసి ప్రజలను మోసం చేసినట్టు గుర్తించారు. ఇప్పటివరకు 30 మందికి పైగా బాధితులు ఉన్నట్లు, మొత్తం మోసపు విలువ రూ.3 కోట్లకు మించిందని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి, బంగారం ఎక్కడికి తరలించారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇలాంటి ఘటనలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. కోజికడ్ జిల్లాలో కూడా ఇదే తరహా గోల్డ్ లోన్ మోసాలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వడ్డీ లేకుండా గోల్డ్ లోన్ ఇస్తామంటే తప్పకుండా అనుమానించాలని, ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన బ్యాంకులు, NBFCలకే బంగారం తాకట్టు పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి రసీదు, ఒప్పంద పత్రాలు లేకుండా బంగారం ఇవ్వడం తీవ్రమైన ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

ఆకర్షణీయంగా కనిపించే ఆఫర్ల వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోకుండా నిర్ణయం తీసుకుంటే, అవసరాన్ని తీర్చుకోవాల్సిన బంగారం చివరికి జీవితకాల నష్టంగా మారే ప్రమాదం ఉందని ఈ ఘటనలు స్పష్టంగా చెబుతున్నాయి.

– Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page