తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం జరిగిన బంద్లో కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీ మరియు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీలు కలిసి పాల్గొనడం కేవలం రాజకీయ డ్రామా తప్ప మరొకటి కాదు. ఆర్టికల్ 340 అమలు బాధ్యత కేంద్రంపై, స్థానిక జీఓల బాధ్యత రాష్ట్రంపై ఉంది. సమస్యను తమ తమ అధికార పరిధిలో పరిష్కరించడానికి బదులు, వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడం ప్రజలను మభ్యపెట్టే పగటి వేషం. బాధ్యతను విస్మరించి, పాలకులే ప్రతిపక్షాలై మారిన ఈ ‘ముఠా డ్రామా’ కేవలం రాబోయే వోట్ల వేట కోసమే తప్ప, సామాజిక న్యాయం కోసం కాదనేది నిర్ద్వంద్వంగా స్పష్టమవుతోంది. ఈ రాజకీయ కపటాన్ని, తమ వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చే ‘బ్లేమ్-గేమ్’ను ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది.
వాస్తవం వర్సెస్ వాటా :
బీసీల హక్కుల పోరాటం వెనుక ఉన్న సంఖ్యలు, పాలకుల ద్రోహాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీసీ జనాభా సుమారు 56 శాతానికి పైగా ఉన్నా, కేంద్రంలో వారికి కేవలం 27% రిజర్వేషన్ మాత్రమే లభిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ప్రభుత్వం ఇటీవల జరిపిన కులగణన సర్వే ప్రకారం, మొత్తం బీసీ జనాభా 56.33% గా అధికారికంగా నిర్ధారించబడింది. ఇంత భారీ జనాభా ఉన్నప్పటికీ, న్యాయపరమైన అడ్డంకులు మరియు పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో కూడా బీసీలకు 29% రిజర్వేషన్లు మించి అమలు కావడం లేదు. ఈ జనాభా-రిజర్వేషన్ల మధ్య భారీ అంతరం అనేది కేవలం అగ్రకుల ఆధిపత్య మనస్తత్వాన్ని మరియు అంబేద్కర్ ఆశయాలకు జరుగుతున్న అపచారాన్ని మాత్రమే సూచిస్తుంది.
చట్టపరమైన చిక్కుముడి:
బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం న్యాయం దక్కకపోవడానికి ప్రధాన అడ్డంకి సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిమితి. ఈ హద్దు కారణంగానే తెలంగాణ ప్రభుత్వం GO 9 ద్వారా 42% రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ, హైకోర్టు స్టే విధించాల్సి వచ్చింది. అయితే, ఈ చట్టపరమైన చిక్కుముడిని ఆసరాగా చేసుకుని, అగ్రకుల సంఘాలు కోర్టు మెట్లెక్కడం వెనుక స్పష్టమైన రాజకీయ కుట్ర దాగి ఉంది. ఈ చర్య GO 9 ను నిర్వీర్యం చేయడానికే ఉద్దేశించినప్పటికీ, బంద్లో పాల్గొంటున్న పాలక పార్టీలు తమ అధికార కేంద్రాల ద్వారా అన్యాయాన్ని కొనసాగించడం రాజకీయ కపటం. ఈ చిక్కుముడిని విప్పాలంటే, రాజ్యాంగ సవరణ ద్వారా 50% పరిమితిని సడలించడం లేదా బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే పరిష్కారం.
న్యాయం దక్కేదెప్పుడు.?
తెలంగాణలో జరిగిన ఈ బంద్, సామాజిక న్యాయ పోరాటాన్ని రాజకీయం చేసే పాలకుల వికృత రూపం మాత్రమే. 56.33% జనాభా ఉన్న బీసీలు తమ హక్కుల కోసం వీధుల్లోకి రావాల్సిన దుస్థితికి ఢిల్లీ, హైదరాబాద్ ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలి. కేవలం ఒక రోజు బంద్తో సమస్య పరిష్కారం కాదు. బీసీలకు జనాభా దామాషా ప్రాతిపదికన న్యాయం దక్కాలంటే, ఈ రాజకీయ పగటి వేషాలను ఖండించి, శాశ్వత పోరాటం చేయాలి. ఇకనైనా రాజకీయ పార్టీలు తమ ‘బ్లేమ్-గేమ్’ను పక్కన పెట్టి, రాజ్యాంగ సవరణ దిశగా పారదర్శకంగా కృషి చేయాలి. లేనిపక్షంలో, బీసీల ఆగ్రహ జ్వాలలు రాబోయే ఎన్నికల్లో ఈ పాలకుల సింహాసనాలను కాల్చివేయడం ఖాయం.
వ్యాసకర్త: ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ (9640466464)

