వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాను అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. బుధవారం స్థానిక భుక్తాపూర్ లోని విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించిన కలెక్టర్, అటెండెన్స్ రిజిస్టర్లు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాను అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలని స్పష్టం చేశారు. రైతులు విద్యుత్ సమస్యల కారణంగా ఇబ్బందులు పడకుండా క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు విఫలమైనా లేదా సాంకేతిక లోపాలు తలెత్తినా, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా వాటిని పునరుద్ధరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరిగితే సహించేది లేదని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్. శేషారావు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

