• బిజెపికి షాక్.. అవిరైన ఆశలు
• బల్దియా పీఠంపై బండారి అనూష
• స్వతంత్ర అభ్యర్థికే పట్టం కట్టిన ప్రధాన పార్టీలు
• వైస్ చైర్మన్ గా మొహమ్మద్ రోహిత్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ బల్దియాలో ఉత్కంఠ వీడింది. మున్సిపల్ చైర్మన్ పదవి పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజెపి అంచనాలు తారుమారు అయ్యాయి. కాషాయ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, కోలుకోలేని విధంగా షాక్ ఇచ్చాయి. అదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా 21 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ కి చైర్మన్ పదవి దక్కకపోవడంతో ఆ పార్టీ నేతల ఆశలు ఆవిరి అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బండారి అనూష బల్దియా బాస్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా 44వ వార్డ్ ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. ఈ నెల 11 న అదిలాబాద్ మున్సిపల్ కు ఎన్నికలు జరిగాయి. మొత్తం 49 వార్డులకుగాను బీజేపీ, 21 కాంగ్రెస్ 11, బీఆర్ ఎస్ 06, ఎంఐఎం 06, స్వతంత్ర అభ్యర్థులు 05 చొప్పున గెలుపొందారు. ఎలాగైనా సరే ఈసారి మాత్రం అదిలాబాద్ మున్సిపల్ పై కాషాయం జెండా ఎగరడం ఖాయమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తో చైర్మన్ పదవిని స్వంతం చేసుకుంటామని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థికే జై కొట్టిన ప్రధాన పార్టీలు..
కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన బండారి అనూష -సంతోష్ 45 వ వార్డు నుంచి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచి, 338 ఓట్లతో గెలుపొందింది. సోమవారం చైర్మన్ ఎన్నిక వేళ ప్రధాన పార్టీలు కాంగ్రె స్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై స్వతంత్ర అభ్యర్థికి జై కొట్టారు. అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బండారి అనూష పేరును కాంగ్రెస్ ప్రతిపాదించింది. బీఆర్ఎస్ మద్దతు పలికింది. మ్యాజిక్ ఫిగర్ ఓట్లు 27 రావడంతో ఆమె చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా ఎంఐఎం 45 వ వార్డు అభ్యర్థి మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. ప్రధాన పార్టీలు సంబురాలు జరుపుకున్నారు.

