📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeBusinessబడ్జెట్ 2026 : బంగారం ‘నిద్ర’ లేపే వ్యూహమా..? రైతులు, సామాన్యులపై ప్రభావం ఎంత..?

బడ్జెట్ 2026 : బంగారం ‘నిద్ర’ లేపే వ్యూహమా..? రైతులు, సామాన్యులపై ప్రభావం ఎంత..?

భారతదేశం 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలంటే సంప్రదాయ వనరులను ఆధునిక ఆర్థిక వ్యవస్థలోకి అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ఆ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. భారతీయ గృహాల్లో నిశ్చలంగా ఉన్న బంగారం. అధికారిక అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇళ్లలో సుమారు 34,600 టన్నుల బంగారం నిరుపయోగంగా నిల్వ ఉంది. ఈ ‘ఐడిల్ గోల్డ్’ను ఆర్థిక చలామణిలోకి తేవడమే బడ్జెట్ 2026 ముందున్న పెద్ద సవాల్‌గా మారింది.

ఇటీవల కాలంలో తులం బంగారం ధర రూ.1.5 లక్షలకు చేరువవడం వల్ల భారీ ఆభరణాల కొనుగోలు తగ్గి, ఒక గ్రాము గోల్డ్, డిజిటల్ గోల్డ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ కాయిన్స్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇవి ఎక్కువగా లాకర్లలోనే ఉండిపోవడంతో లిక్విడిటీ సమస్య కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ 2026లో డిజిటల్ గోల్డ్‌ను ప్రోత్సహించే విధానాలు రావొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విఘ్నహర్త గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర లూనియా ప్రకారం, బంగారాన్ని డిజిటల్ రూపంలోకి మార్చడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఊతం లభించవచ్చు. ఇది రూ.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి కీలక సాధనంగా మారే అవకాశం ఉంది.

Digital gold powering India 2047 with farmers using technology in a smart financial ecosystem
Futuristic India 2047 powered by digital gold, connecting farmers and cities through a smart financial ecosystem.

ఇదే సమయంలో నిలిపివేయబడిన సావరీన్ గోల్డ్ బాండ్లు (SGB) మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ పథకం చిన్న, మధ్యతరహా పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు వడ్డీ ఆదాయం కూడా లభించడంతో ఇది ప్రజాదరణ పొందింది. అయితే ఇటీవల ఈ స్కీమ్ నిలిపివేతపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి సులభంగా మూలధనం సమీకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని, అందుకే బడ్జెట్ 2026లో దీనిని పునరుద్ధరించాలని పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు.

గోల్డ్ లోన్లు: పన్ను భారం తగ్గుతుందా..?

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గోల్డ్ లోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కేవలం వినియోగ రుణాలు మాత్రమే కాకుండా రైతులు, చిన్న వ్యాపారులకు అత్యవసర పెట్టుబడి సాధనాలుగా మారాయి. వ్యవసాయ ఖర్చులు, విద్య, వైద్య అత్యవసరాల కోసం గ్రామీణ కుటుంబాలు ఎక్కువగా గోల్డ్ లోన్లపై ఆధారపడుతున్నాయి. 2025 మార్చి నాటికి రూ.12 లక్షల కోట్లుగా ఉన్న గోల్డ్ లోన్ మార్కెట్ 2027 నాటికి రూ.18 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.అయితే ఈ విస్తృత వినియోగం మధ్య ఒక కీలక సమస్య ఉంది. పరోక్ష పన్నుల భారం. గోల్డ్ లోన్ వడ్డీపై జీఎస్టీ లేకపోయినప్పటికీ, ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ ఎక్స్‌టెన్షన్ ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇండెల్ మనీ సీఈఓ ఉమేష్ మోహనన్ ప్రకారం, ఇది సామాన్యులకు అదనపు భారం అవుతోంది. బడ్జెట్ 2026లో ఈ ఛార్జీలపై పన్ను ఉపశమనం కల్పిస్తారా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఆర్థిక సమ్మిళితానికి గోల్డ్ లోన్లు అత్యంత కీలకమైన సాధనంగా మారుతున్న తరుణంలో, పన్ను నిర్మాణాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులుగా నిలుస్తున్నాయి.

పాలసీ దిశ : వినియోగం నుంచి పెట్టుబడికి

బడ్జెట్ 2026 కేవలం పన్ను మార్పులకు పరిమితం కాకుండా, భారతీయుల బంగారు పొదుపును దేశాభివృద్ధికి అనుసంధానించే దిశగా ఉండాలని ఆర్థిక వర్గాలు ఆశిస్తున్నాయి. డిజిటల్ గోల్డ్, SGB పునరుద్ధరణ, గోల్డ్ లోన్ ఛార్జీలపై ఉపశమనం.. ఈ మూడు అంశాలు బడ్జెట్‌లో చోటు చేసుకుంటే బంగారం కేవలం విలువైన లోహంగా కాకుండా అభివృద్ధి సాధనంగా మారే అవకాశం ఉంది.ప్రభుత్వ నిర్ణయాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. అప్పటివరకు రైతులు, సామాన్యులు, చిన్న వ్యాపారులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

బడ్జెట్ 2026లో గోల్డ్ పాలసీలకు ప్రాధాన్యం ఇస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించవచ్చు. అయితే పన్ను ఉపశమనం లేకుండా డిజిటల్ గోల్డ్ ప్రోత్సాహం మాత్రమే సరిపోదు. విధానాల అమలు ఎంత సమర్థంగా ఉంటుందన్నదే అసలు పరీక్ష.

Written by: Qamar SD

Vaasthava Nestham Editorial Team

Published: January 16, 2025 | 04:14 PM

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page