వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: నేటి బంగారం ధరలు సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీగా తగ్గాయి. జనవరి 8వ తేదీ గురువారం దేశీయ మార్కెట్లో పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,270గా కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,26,750గా నమోదైంది. అదే సమయంలో ఒక కిలో వెండి ధర రూ. 2,51,500గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే బంగారం, వెండి రెండింటిలోనూ స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది.
దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. అమెరికా మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్స్కు సుమారు 4,453 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు దాదాపు ఒక శాతం కన్నా తక్కువగా పడిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల బంగారం భారీ ర్యాలీ జరగడంతో ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడం వల్లే ఈ తగ్గుదల చోటుచేసుకున్నట్లు విశ్లేషిస్తున్నారు.
అమెరికాలో ఫిబ్రవరి డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు సుమారు 0.8 శాతం మేర తగ్గాయి. దీర్ఘకాలంగా బంగారం ధరలు వేగంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ దశ కొనసాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెండిపై కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు దాదాపు నాలుగు శాతం వరకు పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు బంగారం ధరలకు మద్దతు ఇవ్వవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వెనుజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోపై అమెరికా తీసుకున్న చర్యలు, అలాగే వెనుజులా చమురుకు సంబంధించిన కీలక ప్రకటనలు ప్రపంచ మార్కెట్లలో చర్చనీయాంశంగా మారాయి.
వెనుజులా చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా నియంత్రణలోని బ్యాంక్ ఖాతాల్లో నిల్వ చేస్తామని, ఆ డబ్బుతో వెనుజులా కేవలం అమెరికాలో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. చమురు, ఆహార ఉత్పత్తులు, మందులు, మెడికల్ పరికరాలు, విద్యుత్ రంగానికి సంబంధించిన యంత్రాలు అన్నీ కూడా మెయిన్ ఇన్ యూఎస్ఏ ఉత్పత్తులే కొనుగోలు చేయాలన్న నిబంధనలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి.

వెనుజులాలో నిల్వ ఉన్న చమురును మొదటి దశలో విక్రయించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మరింత మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Author: Qamar SD

