e-paper
Sunday, January 25, 2026
HomeBusinessSilver Jewellery Rule: వెండి ఆభరణాలపై కొత్త రూల్.. కొనుగోలు చేసే ముందు ఇది తప్పకుండా...

Silver Jewellery Rule: వెండి ఆభరణాలపై కొత్త రూల్.. కొనుగోలు చేసే ముందు ఇది తప్పకుండా చెక్ చేయండి!

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈరోజే ఒక్కసారిగా కేజీకి రూ. 12,000 వరకు పెరగడంతో వెండి ధర రూ. 2,83,000 స్థాయికి చేరుకుంది. ఇంత భారీ ధర చెల్లించి వెండి కొనుగోలు చేస్తున్నప్పుడు అది నిజంగా స్వచ్ఛమైనదేనా అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది.

ఈ నేపథ్యంలోనే వెండి ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు బంగారం కొనుగోలులో హాల్‌మార్క్ తప్పనిసరిగా మారినప్పటికీ, వెండి విషయంలో అంత కఠినమైన నిబంధనలు అమల్లో లేవు. దీని వల్ల స్వచ్ఛత లేని వెండిని విక్రయించే మోసాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇకపై అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) దేశవ్యాప్తంగా వెండి వస్తువులపై హాల్‌మార్కింగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

సిల్వర్ హాల్‌మార్కింగ్ అంటే వెండిలో ఎంత శాతం స్వచ్ఛత ఉందో అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియ. హాల్‌మార్క్ ఉన్న ప్రతి వెండి వస్తువుపై BIS లోగో, స్వచ్ఛత శాతం (Fineness), జ్యువెలర్ గుర్తింపు మార్క్‌తో పాటు ప్రత్యేకమైన HUID (Hallmarking Unique Identification) నంబర్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న వెండి నాణ్యతపై పూర్తి స్పష్టత పొందవచ్చు.

BIS డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం బంగారంపై 373 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా అమల్లో ఉంది. వెండి విషయంలో మాత్రం ఇప్పటివరకు స్వచ్ఛంద ప్రాతిపదికన కొనసాగుతోంది. అయితే సెప్టెంబర్ 1, 2025 నుంచి HUID ఆధారిత హాల్‌మార్కింగ్ విధానం వెండికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు లక్షల సంఖ్యలో వెండి వస్తువులకు ఇప్పటికే హాల్‌మార్కింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

వెండి హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయితే వినియోగదారులకు అనేక లాభాలు కలుగుతాయి. వెండిలో ఇతర లోహాలు కలిపి అమ్మే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. వస్తువు స్వచ్ఛతను బట్టి సరైన ధర చెల్లించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వెండిని అమ్మాలనుకున్నప్పుడు హాల్‌మార్క్ ఉన్న వస్తువులకు మెరుగైన రీసేల్ విలువ లభిస్తుంది. BIS గుర్తింపు ఉండటం వల్ల కొనుగోలుదారులకు నమ్మకం మరింత పెరుగుతుంది.

దేశవ్యాప్తంగా అవసరమైన పరీక్షా కేంద్రాలు, మౌలిక వసతులు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాతే వెండిపై హాల్‌మార్కింగ్‌ను పూర్తిగా తప్పనిసరి చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అప్పటివరకు కూడా వినియోగదారులు వెండి కొనుగోలు చేసే సమయంలో హాల్‌మార్క్, ముఖ్యంగా HUID నంబర్ ఉన్న వస్తువులనే అడిగి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Silver hallmarking rule in India: BIS makes purity check important before buying silver jewellery
New silver hallmarking rule aims to protect buyers as prices surge

వెండి ఆభరణాలు, పూజా వస్తువుల వినియోగం ఎక్కువగా ఉండే మన దేశంలో హాల్‌మార్కింగ్ నిబంధన వినియోగదారుల హక్కులను కాపాడడంలో కీలక పాత్ర పోషించనుంది. కాబట్టి ఇకపై వెండి కొనుగోలు చేసే ప్రతిసారి HUID గుర్తు ఉందో లేదో తప్పకుండా తనిఖీ చేయండి. అలా చేస్తే మీ కష్టార్జిత డబ్బుకు సరైన విలువ దక్కుతుంది.

Author : Qamar SD

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page