వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: దేశీయ బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డు నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, భౌగోళిక అస్థిరతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు
రక్షణాత్మక ఆస్తుల వైపు మొగ్గుచూపుతుండటమే ఈ దూకుడుకు ప్రధాన కారణంగా మారింది.
కేజీ వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పెరిగి రూ. 2.71 లక్షలు తాకగా, అదే సమయంలో ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 400 పెరిగి రూ. 1,45,000కు చేరింది. అన్ని పన్నులు కలుపుకుని 99.9 స్వచ్చత కలిగిన బంగారం, వెండి ధరలివి అని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
రెండు రోజుల్లోనే రూ. 21,000 జంప్… వెండి పరుగుకు కారణాలివే
గత వారాంతంలో కేజీ వెండి ధర రూ. 2.50 లక్షల వద్ద ముగియగా, సోమవారం ఒక్కసారిగా రూ. 15,000 పెరిగి రూ. 2.65 లక్షలకు చేరింది. తాజాగా మరో రూ. 6,000 జంప్తో
రెండు రోజుల్లో మొత్తం రూ. 21,000 లాభాన్ని నమోదు చేసింది.
2026 ప్రారంభం నుంచి ఇప్పటివరకు వెండి ధరలు దాదాపు రూ. 32,000 (13.4 శాతం) పెరిగాయి. 2025 డిసెంబర్ 31న రూ. 2.39 లక్షల వద్ద ఉన్న వెండి ధరలు ప్రస్తుతం చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. వెండికి సోలార్ పవర్, ఈవీలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఇండస్ట్రియల్ అవసరాల నుంచి బలమైన డిమాండ్ ఉండటం ధరలకు మరింత మద్దతుగా నిలుస్తోంది.
గ్లోబల్ మార్కెట్లలోనూ రికార్డుల వర్షం
అంతర్జాతీయ మార్కెట్లలోనూ విలువైన లోహాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. బంగారం ఔన్స్ ధర 4,630 డాలర్లు దాటగా, వెండి ఔన్స్ 88.56 డాలర్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. న్యూయార్క్ కామెక్స్ ఫ్యూచర్స్లో ఫిబ్రవరి బంగారం కాంట్రాక్ట్ 4,632 డాలర్లకు, మార్చి వెండి కాంట్రాక్ట్ 88.56 డాలర్లకు చేరడం గమనార్హం.

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు, ఈటీఎఫ్లు,
అసెట్ మేనేజర్లు పెద్ద ఎత్తున పసిడిలో పెట్టుబడులు పెడుతుండటంతో ధరలకు మరింత బలం చేకూరుతోంది.
Author: QAMAR SD, Vaasthava Nestham
