ఇప్పటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు డాలర్ కంటే బంగారాన్ని ఎక్కువగా నమ్ముతున్నాయని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు ఆనంద్ శ్రీనివాసన్ అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది బంగారం పెట్టుబడిదారులకు చరిత్రలోనే అరుదైన లాభాలను అందించింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 80 శాతం వరకు ధరలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లలో సంచలనంగా మారింది.
ఇంత భారీ ధరల పెరుగుదల బంగారం చరిత్రలో అరుదైన సంఘటనగా నిపుణులు చెబుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగుతుందనే అంచనాలతో ఈ ఏడాది కూడా సామాన్య ప్రజల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకు బంగారం కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ప్రధాన కారణంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని అనూహ్య నిర్ణయాలు, వాణిజ్య సుంకాల విధింపు, గ్లోబల్ టెన్షన్స్ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు Safe Assetగా భావించే బంగారం వైపు మళ్లారు.
డాలర్ మరియు బంగారం మధ్య ఉన్న సంబంధం ఇప్పుడు వేగంగా మారుతోంది. సాధారణంగా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో డాలర్ను ఎక్కువగా, బంగారాన్ని తక్కువగా ఉంచేవి. కానీ గత కొన్నేళ్లుగా ఈ వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుండగా, మరోవైపు ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీని ఫలితంగా ఇప్పుడు డాలర్ నిల్వలు మరియు బంగారం నిల్వలు దాదాపు సమాన స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో బంగారం డాలర్ను మించిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఈ మార్పుకు బలమిస్తున్నాయి. రష్యా ట్యాంకర్లను అమెరికా దళాలు అడ్డుకోవడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించడం, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరింత అస్థిరత వైపు నడిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డాలర్ కంటే బంగారమే భద్రమన్న భావన దేశాల్లో బలపడుతోంది.
పెట్టుబడి కోణంలో కూడా బంగారానికి ప్రాధాన్యం పెరుగుతోంది. డెలాయిట్ నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రజలు ఇప్పుడు బంగారాన్ని కేవలం ఆభరణాలకే పరిమితం చేయడం లేదు. Wealth Protection మరియు Long Term Growth కోసం ఒక ముఖ్యమైన సాధనంగా చూస్తున్నారు.
అమెరికా తీసుకున్న కొన్ని చర్యల పట్ల దేశాల్లో భయం కూడా పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా వద్ద ఉన్న డాలర్ నిల్వలను అమెరికా ఫ్రీజ్ చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన తర్వాత భవిష్యత్తులో తమ డాలర్ ఆస్తులు కూడా ఎప్పుడైనా స్తంభింపబడతాయేమో అన్న ఆందోళన అనేక దేశాల్లో నెలకొంది.

ఈ భయాల కారణంగానే ఇప్పుడు చాలా దేశాలు తమ విదేశీ నిల్వల్లో బంగారాన్ని పెంచుకుంటూ, డాలర్పై ఆధారాన్ని తగ్గిస్తున్నాయి. ఇది కేవలం పెట్టుబడి వ్యూహం కాదు, ఒక దీర్ఘకాలిక గ్లోబల్ ఫైనాన్షియల్ స్ట్రాటజీగా మారుతోందని నిపుణులు భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యం ప్రశ్నార్థకంగా మారుతున్నదా అన్న చర్చ బలపడుతోంది. బంగారం మరోసారి గ్లోబల్ ఫైనాన్స్ లో కీలక పాత్ర పోషించే దశకు చేరుతోందని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Author: Qamar SD
