దేశీయ మార్కెట్లో వెండి ధరలు గతంలో ఎన్నడూ చూడని స్థాయిలకు చేరుకుని కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ.3 లక్షల మార్క్ను దాటి ట్రేడ్ అవుతుండటంతో బులియన్ మార్కెట్తో పాటు సాధారణ వినియోగదారులు, పెట్టుబడిదారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఒక ఔన్స్కు సుమారు 90 డాలర్ల వద్ద కొనసాగుతుండటం ఈ ర్యాలీకి మరింత బలం చేకూరుస్తోంది.
ఇదిలా ఉండగా, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకీ వెండి ధర భవిష్యత్తులో ఒక్క ఔన్స్కు 200 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, వెండి బంగారంతో పోలిస్తే వేగంగా పెరిగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఈ భారీ ర్యాలీ తర్వాత వెండిలో గణనీయమైన కరెక్షన్ వచ్చే అవకాశాన్ని కూడా మార్కెట్ నిపుణులు తోసిపుచ్చడం లేదు.
అయితే వెండి ధరను అసలు ఎవరు నిర్ణయిస్తారు? సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో నిర్ణయించే స్పాట్ ధర ఆధారంగానే దేశీయ ధరలు ఖరారవుతాయి. భారత్లో వెండి ఉత్పత్తి పరిమితంగా ఉండటంతో ఎక్కువ భాగం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే అంతర్జాతీయ ధరతో పాటు కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, లాజిస్టిక్స్ ఖర్చులు, రిఫైనింగ్ ఛార్జీలు, ట్రేడింగ్ మార్జిన్లు కలిపి దేశీయ ధర నిర్ణయమవుతుంది.
ప్రస్తుతం లెక్కలు ఇలా ఉన్నాయి:
– ఒక ఔన్స్ వెండి ధర: 90 డాలర్లు
– ఒక కిలో వెండి = 32.1507 ట్రాయ్ ఔన్స్లు
– ప్రస్తుత డాలర్ విలువ: సుమారు రూ.90.26
ఈ ప్రకారం:
90 × 32.1507 = 2,893.56 డాలర్లు (అంతర్జాతీయంగా ఒక కిలో ధర)
2,893.56 × 90.26 = సుమారు రూ.2,61,153
దీనికి దిగుమతి సుంకం, జీఎస్టీ, ఇతర ఛార్జీలు కలిపితే భారత్లో ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ.3.06 లక్షల వద్ద కొనసాగుతోంది.
ఇప్పుడు కీలక ప్రశ్న ఏంటి అంటే.. భవిష్యత్తులో ఏమవుతుంది? ప్రస్తుతం ఒక ఔన్స్ వెండి 90 డాలర్ల వద్ద ఉండగానే కిలో ధర రూ.3 లక్షలు దాటింది. అదే ధర రాబర్ట్ కియోసాకీ అంచనా వేసినట్లుగా 200 డాలర్లకు పెరిగితే, లెక్కల ప్రకారం ఒక కిలో వెండి ధర దాదాపు రూ.6 లక్షల వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే ఈ స్థాయికి చేరుతుందా? లేక మధ్యలోనే భారీ కరెక్షన్ వస్తుందా? అన్నది రాబోయే కాలంలో అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, డాలర్ కదలికలు, పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడిదారుల వైఖరిపై ఆధారపడి ఉంటుంది.
వెండి ధరల పెరుగుదల గ్లోబల్ ట్రెండ్కు అద్దం పడుతోంది, కానీ ఈ ర్యాలీ నిరంతరం కొనసాగుతుందని అనుకోవడం ప్రమాదకరం. డిమాండ్, డాలర్ విలువ, జియోపాలిటికల్ పరిణామాలు కలిస్తే ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉన్నప్పటికీ, మధ్యకాలంలో కరెక్షన్ వచ్చే రిస్క్ను పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకోవాలి.
Written by: Qamar SD
Vaasthava Nestham Editorial Team
Published: January 17, 2025 | 08:45 PM
