• గ్రామ దేవతలకు, భీమన్న దేవుడికి నైవేద్యాల సమర్పణ
• ఇచ్చోడలో భక్తిశ్రద్ధలతో ఆదివాసీ నాయకపోడ్ సంఘం పూజా కార్యక్రమాలు
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: దేశ, రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన నాయకపోడ్ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరుణ దేవుడు కరుణించి సకాలంలో వానలు కురిపించాలని కోరుతూ గిరిజనులు తమ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా స్థానిక గ్రామ దేవతలైన పోచమ్మ తల్లి, మహాలక్ష్మి అమ్మవార్లతో పాటు ఆదివాసీ గిరిజన నాయకపోడ్ తెగ ఆరాధ్య దైవమైన భీమన్న దేవుడికి ఘనంగా పూజలు చేశారు. దేవుళ్లకు పసుపు, కుంకుమలతో అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం నాయకపోడ్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా వర్షాలు పుష్కలంగా కురవాలని, గ్రామంలో ఎలాంటి రోగాలు ప్రబలకుండా ప్రజలంతా చల్లగా ఉండాలని గ్రామ దేవతలను, తమ ఆరాధ్య దైవాన్ని వేడుకున్నట్లు తెలిపారు.

ప్రకృతిని ఆరాధించే గిరిజన సంప్రదాయంలో భాగంగా తరతరాలుగా ఈ పూజలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆదివాసీ గిరిజన నాయకపోడ్ సంఘం నాయకులు పెరుమండ్ల స్వామి, మహిళలు పాల్గొన్నారు.
