• సైకిల్ మెకానిక్ ‘సలీం భాయ్’కు కలెక్టర్ అవార్డు
• అడవుల రక్షణతోనే గ్లోబల్ వార్మింగ్కు చెక్: జిల్లా కలెక్టర్
• ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం కావాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలంటే అడవుల పరిరక్షణే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘ప్రజా పరిపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలం పుల్గూడ అటవీ బీట్లో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) ప్రశాంత్లతో కలిసి మొక్కలు నాటి ప్రారంభించారు.
పుల్గూడ బీట్లో అడవుల పునరుద్ధరణ కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా అధిక సాంద్రత గల మిశ్రమ మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణాన్ని పరిరక్షించడం, అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని వివరించారు. “కేవలం చెట్లు నాటడం ఎంత ముఖ్యమో.. అవి పెద్ద వృక్షాలుగా ఎదిగే వరకు కంటికి రెప్పలా రక్షించడం అంతకంటే ముఖ్యం” అని ఆయన నొక్కి చెప్పారు.
పోలీస్ శాఖ పూర్తి మద్దతు: ఎస్పీ
పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యతగా సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు, అడవులను రక్షించేందుకు పోలీస్ శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ హరిత కార్యక్రమాలు విజయవంతం అవుతాయని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండ్రీ అనూష, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ నిరూష, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎఫ్డీఓ అరవింద్, ఇతర ప్రజాప్రతినిధులు, అటవీ మరియు పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆదర్శంగా నిలిచిన ‘సలీం భాయ్’.. పర్యావరణ సేవకు దక్కిన గౌరవం
పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇచ్చోడకు చెందిన సలీం భాయ్కు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు ప్రదానం చేశారు. వృత్తిరీత్యా ఒక చిన్న సైకిల్ పంచర్ షాప్ నడుపుకునే సలీం భాయ్.. పర్యావరణ పరిరక్షణ పట్ల తనకున్న అపారమైన మక్కువతో స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో లేకపోయినా, పర్యావరణంపై ఉన్న ప్రేమతో మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి నిస్వార్థ సేవలు చేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా జిల్లా యంత్రాంగం ఈ అవార్డుతో సత్కరించింది. సామాన్యుడిగా ఉంటూ అసామాన్యమైన సామాజిక బాధ్యతను చాటుకున్న సలీం భాయ్ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.

