📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీకి కొత్త శకం ‘జలై జాకు’

ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీకి కొత్త శకం ‘జలై జాకు’

• గత ఐదు సంవత్సరాలనుండి కష్టసుఖాల్లో ప్రజల చెంతకు 

• తన సేవను గుర్తించి పట్టం కట్టిన ప్రజలు 

• వారసత్వ సర్పంచ్ వ్యవస్థను తిరస్కరించిన ప్రజలు..!

• ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా జలై జాకు

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ సంకల్పాన్ని స్పష్టం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా నిరంతర సేవతో ప్రజల మనసులు గెలుచుకున్న ఆదివాసీ నాయకుడు జలై జాకు, ను సర్పంచ్ గా గెలిపించి ‘వారసత్వ’ బంధాన్ని బద్దలుకొట్టి, అద్భుత విజయం అందించారు. సామాన్యుడు , ప్రజాసేవ చేయాలని పరితపించేవారు కూడా ప్రజల ఆశీర్వాదంతో నాయకత్వ స్థానాన్ని చేరగలడని ఈ సర్పంచ్ ఎన్నికలు రుజువు చేశాయి. జలై జాకు పేరు గత కొన్నేళ్లుగా ఇచ్చోడ మండలం అంతటా వినిపిస్తోంది. అధికారంలో లేకపోయినా, ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలను పట్టించుకొని తాను సేవ చేసిన కార్యక్రమాలు ఆయన పనిచేసే తీరును చూపించాయి. ఏ సమస్య వచ్చినా ముందుండి స్పందిస్తాడన్న నమ్మకం ప్రజల్లో బలపడింది. అధికారంలో లేకుండానే ఇలా పనిచేస్తే, పదవి ఇస్తే ఇంకా మంచిగా చేస్తాడనే విశ్వాసమే జలై జాకు విజయానికి ప్రధాన కారణమని గ్రామస్థులు అంటున్నారు.

 

‘వారసత్వ సర్పంచ్ వ్యవస్థ’ను ప్రజలు తిరస్కరించిన ప్రజలు..

ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ పదవి గత 15 సంవత్సరాల నుండి ఒకే కుటుంబానికే పరిమితమై ఉండేది. ఈసారి మాత్రం ప్రజలు మార్పును ఇష్టపడ్డారు. జలై జాకు ఆదివాసి ఉద్యమ నాయకుడిగా, న్యాయం వైపు ఎల్లప్పుడూ నిలబడే వ్యక్తి అని ప్రజల్లో మంచి పేరు ఉంది. ఇదే ఆయనకు కలిసి వచ్చిన అంశముగా చెప్పుకోవచ్చు.. దీంతో ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా “సర్పంచ్ పదవి వారసత్వం కాదు.. సేవ చేసే వాడిదే” అని తీర్పు ఇచ్చారు. పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. గత 15 సంవత్సరాల నుండి మూడు పర్యాయాలు వరుసగా సర్పంచ్ గా పని చేసిన దేవానంద్, జలై జాకు ఇద్దరు ప్రధాన అభ్యర్థులు తమవంతుగా కఠినంగా ప్రచారం చేశారు. నువ్వా… నేనా అన్నట్టుగా ప్రతి ఓటు కీలకమైన పరిస్థితిలో చివరి నిమిషం వరకు తేడా అతి స్వల్పంగా ఉండేది. అయితే, ఎన్నికల చివరి రోజు వరకు గ్రామ ప్రజలు స్పష్టంగా చెప్పిన మాట.. “సేవ చేసిన వాడికి మా ఓటు.” అదే నిర్ణయం చివరికి ఫలితాల్లో ప్రతిఫలించింది. ఓట్ల లెక్కింపు ముగిసే సరికి జలై జాకు స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచారు.

ప్రజలు గెలిపించిన నాయకుడు.. జాకు

ఇచ్చోడ మేజర్ వంటి పెద్ద గ్రామపంచాయతీలో ఒక ఆదివాసి అభ్యర్థి విజయం సాధించడం ప్రత్యేకమైన సంఘటనగా నిలిచింది. గత 30 సంవత్సరాల నుండి జలై జాకు, వారి కుటుంబ సభ్యులు మండలంలోని తలమద్రి గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. గిరిజన సమాజం మాత్రమే కాకుండా గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు సమానంగా జలై జాకు పక్షాన ఓటేశారు. ఇది కేవలం ఒక వ్యక్తి గెలుపు మాత్రమే కాదు; సమానత్వం, ప్రజాస్వామ్య నైతిక విలువలు, సామాజిక చైతన్యం గెలిచిన విజయం అని చెప్పవచ్చు. జలై జాకు విజయం ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీకి కొత్త దిశని చూపించింది. గతంలో కొందరి చేతుల్లోనే ఆపాదించబడి ఉండే ప్రజాప్రభుత్వం, ఈసారి నిజమైన ప్రజాహిత నాయకుడిని ఎంచుకుంది. అతని విజయం సామాన్య ప్రజల శక్తిని మరోసారి నిరూపించింది. పదవి కాదు.. సేవే నాయకుడిని నిలబెడుతుంది అనే సందేశాన్ని ఈ ఎన్నికలు స్పష్టంగా తెలియజేశాయి. గ్రామ అభివృద్ధికి జలై జాకు నాయకత్వం మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page