మహారాష్ట్రలోని బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ప్రైవేట్ జెట్ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ మృతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అనుకూల వాతావరణం, అత్యంత అనుభవజ్ఞుడైన పైలట్ ఉన్నప్పటికీ ఈ ఘోర ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. చివరి క్షణాల్లో విమానం ఎందుకు అదుపుతప్పింది..? ల్యాండింగ్ సమయంలో ఏం జరిగింది..? అన్న ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలను వెంటాడుతున్నాయి. ముంబై నుంచి బయల్దేరిన ఈ విమానంలో మహారాష్ట్రకు చెందిన ఉప ముఖ్యమంత్రి, మరికొందరు రాజకీయ నేతతో పాటు ఆయన సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఉదయం ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్వే అంచునే విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ప్రమాదం తీవ్రత కారణంగా విమానం పూర్తిగా దగ్ధమవడంతో ప్రాణ నష్టం సంభవించింది. ఈ విషాద ఘటన రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది.
రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నమే ప్రమాదానికి కారణమా..?
సోషల్ మీడియా, అవియేషన్ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ విమానం మొదటిసారి ల్యాండింగ్కు ప్రయత్నించి విఫలమైంది. దీనిని అబార్టెడ్ ల్యాండింగ్గా పేర్కొంటున్నారు. అనంతరం రెండోసారి ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ విమానం సాధారణంగా లైవ్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లలో కనిపించాల్సి ఉండగా, ప్రమాదానికి ముందు దాని కదలికలు స్పష్టంగా నమోదు కాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది సాంకేతిక లోపమా..? లేక ఆపరేషనల్ పరిమితులా…? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
క్లియర్ విజిబిలిటీ.. అయినా ఎందుకు కంట్రోల్ తప్పింది..?
ప్రమాదం జరిగిన సమయంలో బారామతి లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని అధికారులు తెలిపారు. విజిబిలిటీ సుమారు 3,500 మీటర్లు వరకు ఉందని, పొగమంచు లేదా వర్షం వంటి అడ్డంకులు లేవని ధృవీకరించారు. అంటే వాతావరణం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కాదన్నది ప్రాథమిక అంచనా. విమానాన్ని నడిపిన పైలట్కు 16,000 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉందని సమాచారం. ఇంతటి అనుభవం ఉన్న పైలట్ సమక్షంలోనూ ప్రమాదం జరగడం వెనుక తీవ్రమైన సాంకేతిక లోపం లేదా ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా ఎదురైన యాంత్రిక సమస్య ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా బ్రేకింగ్ సిస్టమ్, ల్యాండింగ్ గియర్ లేదా ఇంజిన్ రివర్స్ త్రస్ట్ వ్యవస్థలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లియర్ జెట్ 45XR & ఆపరేటర్ నేపథ్యం..
ఈ ప్రమాదంలో చిక్కుకున్నది లియర్ జెట్ 45XR మోడల్ విమానం. బాంబార్డియర్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన ఈ జెట్ గంటకు సుమారు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఎనిమిది మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానం గరిష్టంగా 51,000 అడుగుల ఎత్తులో ప్రయాణించేందుకు డిజైన్ చేయబడింది. ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తున్న సంస్థ గతంలోనూ ఒక విమాన ఘటన కారణంగా వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి జరిగిన ప్రమాదం తీవ్రత దృష్ట్యా సంస్థ ఆపరేషనల్ విధానాలపై కూడా విచారణ జరగనుంది. ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుసుకునేందుకు డీజీసీఏ అధికారులు బ్లాక్ బాక్స్ కోసం గాలిస్తున్నారు. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా చివరి నిమిషాల్లో పైలట్, ATC సంభాషణలు, విమానం సాంకేతిక స్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
