వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్ : 2025లో రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధరలు, 2026లో కూడా అదే దూకుడును కొనసాగిస్తున్నాయి. కొత్త ఏడాది ప్రారంభమై ఇంకా పది రోజులు కూడా పూర్తికాకముందే గోల్డ్ రేటు గరిష్టంగా రూ.5400 వరకు పెరగడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి తారా స్థాయికి చేరాయి.
జనవరి 1న హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,060 వద్ద ఉండగా, జనవరి 10 నాటికి అది రూ.1,40,460కి చేరింది. అంటే కేవలం 10 రోజుల్లోనే గోల్డ్ రేటు రూ.5,400 పెరిగిందన్న మాట. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,800 నుంచి రూ.1,28,750 వరకు ఎగబాకింది. ఈ లెక్కన 22 క్యారెట్ల బంగారంపై రూ.4,950 మేర పెరుగుదల నమోదైంది.
చెన్నైలో కూడా పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరి మొదటి రోజున రూ.1,36,140గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, జనవరి 10 నాటికి రూ.1,39,560కి చేరింది. అంటే పది రోజుల్లో రూ.3,420 పెరిగినట్టుగా స్పష్టమవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,24,400 నుంచి రూ.1,29,000 వరకు చేరి రూ.4,600 పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. జనవరి 1న రూ.1,35,210 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, కేవలం పది రోజుల్లోనే రూ.5,400 పెరిగి రూ.1,40,610కి ఎగిసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,950 నుంచి రూ.1,28,900 వరకు చేరింది. అంటే ఇక్కడ కూడా రూ.4,950 మేర పెరుగుదల కనిపిస్తోంది.
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. జనవరి 1న కిలో వెండి ధర సుమారు రూ.2.56 లక్షల వద్ద ఉండగా, జనవరి 10 నాటికి అది రూ.2.75 లక్షలకు చేరింది. అంటే కేవలం పది రోజుల్లోనే కిలో వెండి ధరపై రూ.19,000 మేర భారం పడింది.

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, డాలర్ మారకపు విలువలో మార్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కొత్త ఏడాది ప్రారంభంలోనే గోల్డ్ రేటు ఈ స్థాయిలో పెరగడం పెట్టుబడిదారులతో పాటు సామాన్య కొనుగోలుదారులను కూడా ఆలోచనలో పడేస్తోంది. వచ్చే రోజుల్లో బంగారం ధరలు ఏ స్థాయికి చేరుతాయన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Author: QAMAR SD
