వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వెండి ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బంగారానికి తప్పనిసరిగా అమలులో ఉన్న హాల్మార్కింగ్ విధానాన్ని త్వరలో వెండికీ వర్తింపజేయాలన్న ఆలోచనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వెండి కొనుగోలు సమయంలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
బంగారం స్వచ్ఛతను నిర్ధారించేందుకు కేంద్రం గతంలోనే హాల్మార్కింగ్ నిబంధనను అమల్లోకి తీసుకువచ్చింది. దీని వల్ల బంగారం కొనుగోలులో పారదర్శకత పెరిగింది. అదే తరహాలో వెండికీ హాల్మార్కింగ్ తప్పనిసరి చేస్తే, వెండి ఆభరణాలు మరియు ఇతర ఉత్పత్తుల స్వచ్ఛతపై స్పష్టత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వెండి ధరలు రోజురోజుకూ కొత్త గరిష్టాలను తాకుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
ప్రస్తుతం బంగారానికి పోటీగా వెండి ధరలు భారీగా పెరుగుతుండటంతో డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు నకిలీ లేదా తక్కువ స్వచ్ఛత ఉన్న వెండి మార్కెట్లోకి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వెండికి హాల్మార్కింగ్ తీసుకురావడం ద్వారా నాణ్యతను నిర్ధారించవచ్చని కేంద్రం భావిస్తోంది.
ఈ నిబంధన అమలుకు ముందు అవసరమైన మౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వెండి హాల్మార్కింగ్కు అవసరమైన పరీక్షా కేంద్రాలు, ల్యాబ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాతే కొత్త రూల్ను అమలు చేసే అవకాశముంది. ఇటీవల బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ డైరెక్టర్ సంజయ్ గార్గ్ కూడా వెండికి హాల్మార్కింగ్ అంశంపై స్పందించి, దీనిపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
హాల్మార్కింగ్ విధానం ద్వారా ఆభరణాల స్వచ్ఛతపై వినియోగదారులకు పూర్తి అవగాహన లభిస్తుంది. బీఐఎస్ లోగో, ప్రత్యేక గుర్తింపు సంఖ్య, విక్రేత వివరాలు ఉండటం వల్ల నకిలీ ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చు. దీంతో వెండి కొనుగోలు సమయంలో ఎలాంటి అనుమానం లేకుండా నిర్ణయం తీసుకునే వీలుంటుంది.

ఇదిలా ఉండగా, దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2.72 లక్షల వద్ద ఉండగా, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2.52 లక్షల వరకు ఉంది. ఈ ఏడాది చివరి నాటికి వెండి ధర రూ.3 లక్షల మార్క్ను తాకే అవకాశముందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Author: QAMAR SD

