• గత నెలలో రూ. 4.25 లక్షల గరిష్ఠం..
• నేడు రూ. 2.53 లక్షలకు పతనం..
• ఒక్కసారిగా 40 శాతం మేర కుప్పకూలిన వెండి ధరలు
• అంతర్జాతీయ మార్కెట్లోనూ 120 డాలర్ల నుంచి 75 డాలర్లకు డౌన్
• కొనుగోలుకు తొందరపాటు వద్దంటున్న మార్కెట్ నిపుణులు
బంగారం తర్వాత క్రేజనలోహం ఏదైనా ఉంది అంటే అదే వెండి. క్రమ క్రమంగా వెండి ధరలలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గత నెల రోజులుగా బులియన్ మార్కెట్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ, ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి.. కానీ అదే వెండి ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలింది. నిన్న మొన్నటి వరకు వెండిపై పెట్టుబడులు పెట్టి లాభాల పంట పండించుకుందామనుకున్న ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ సరళి షాకిస్తోంది. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే కిలో వెండిపై ఏకంగా లక్షన్నర రూపాయలు తగ్గడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. దీంతో వెండిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు షాక్ కు గురవుతున్నారు.
రికార్డు స్థాయి నుంచి భారీ పతనం
ఈ రోజు (బుధవారం) దేశీయ మార్కెట్లను పరిశీలిస్తే, ఒక కిలో వెండి ధర సుమారు రూ. 2,53,230 వద్ద ట్రేడ్ అవుతోంది. గత నెలలో ఇదే వెండి ధర ఆల్-టైమ్ రికార్డును తాకుతూ రూ. 4.25 లక్షల గరిష్ఠ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ గరిష్ఠ స్థాయితో పోల్చి చూస్తే, ప్రస్తుతం ధరల్లో దాదాపు 40 శాతం కోత పడింది. చరిత్రలో వెండి ధరల్లో ఇంత వేగంగా, ఇంత భారీ స్థాయిలో హెచ్చుతగ్గులు రావడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి కారణాలేంటి..?
ఈ ఆకస్మిక పతనానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ఒక దశలో 120 డాలర్లు పలికిన ఔన్స్ వెండి ధర, ప్రస్తుతం 75 డాలర్లకు పడిపోయింది.
ప్రాఫిట్ బుకింగ్: ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో, ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోకుండా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు (Profit Booking). దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు దిగివస్తున్నాయి.
మార్కెట్ కరెక్షన్: సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వెండికి పారిశ్రామిక డిమాండ్ ఉన్నప్పటికీ, గత నెలలో ధరలు కృత్రిమంగా పెరిగాయన్న వాదన ఉంది. ఇప్పుడు అది వాస్తవ విలువకు చేరుకునే క్రమంలో ‘మార్కెట్ కరెక్షన్’ జరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కొనుగోలుకు సరైన సమయమేనా?
ధరలు భారీగా తగ్గాయి కదా అని ఇప్పుడే కొనుగోలు చేయడం సాహసమే అవుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉందని, ఈ కరెక్షన్ ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పలేమని వారు అంటున్నారు. “ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ విలువపై ఆధారపడి నడుస్తోంది. ధరలు మరింత తగ్గే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇన్వెస్టర్లు కొంతకాలం వేచి చూడడం ఉత్తమం. అని ప్రముఖ కమోడిటీ నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తానికి, వెండి మెరుపులు తగ్గుముఖం పట్టడంతో, ఆభరణాల ప్రియులు కొంత ఊరట చెందుతుండగా, గరిష్ట స్థాయిల్లో పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. వెండిలో పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.

