రోజురోజుకు బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బంగారం ధరలు మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాయి. పసిడి మార్కెట్లో ఒక్కసారిగా వచ్చిన ఉధృతి సామాన్య వినియోగదారుడిని షాక్కు గురి చేస్తోంది. రోజుకో కొత్త రికార్డు అన్నట్టుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా అమెరికా రాజకీయ నిర్ణయాల ప్రభావం నేరుగా భారత మార్కెట్పై పడుతోంది. పెట్టుబడిదారులు రిస్క్ అసెట్స్ నుంచి సేఫ్ హేవన్గా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ దేశాలపై సుంకాల విధింపుల హెచ్చరికలు చేయడంతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే సమయంలో డాలర్ బలహీనత, వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం కూడా బంగారం ధరల పెరుగుదలకు తోడైంది.
Check the latest 22K & 24K live gold prices updated daily.
దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు
జనవరి 21 నాటికి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. 24 క్యారట్ల బంగారం గ్రాము ధర ఒక్కరోజులోనే రూ.502 పెరిగి రూ.15,480కి చేరింది. 22 క్యారట్ల బంగారం గ్రాము ధర రూ.460 పెరిగి రూ.14,190గా ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల బంగారం గ్రాము ధర రూ.377 పెరిగి రూ.11,611గా నమోదైంది. పెద్ద మొత్తాల్లో చూస్తే ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర ఏకంగా రూ.50,200 పెరిగి రూ.15,48,000కి చేరింది. అదే విధంగా 22 క్యారట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.46,000 పెరిగి రూ.14,19,000గా ఉంది. 18 క్యారట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.37,700 పెరిగి రూ.11,61,100 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1.54 లక్షల స్థాయిని దాటింది. చెన్నైలో మాత్రం స్వల్పంగా ఎక్కువగా రూ.1.55 లక్షలకు చేరింది. ఢిల్లీ, అహ్మదాబాద్ల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. నగరాల మధ్య చిన్న తేడా తప్ప దేశవ్యాప్తంగా బంగారం ధరల ట్రెండ్ ఒకేలా ఉంది.
కొనుగోలుదారులకు హై టెన్షన్..
బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ఇన్వెస్టర్లకు ఇది లాభదాయకమైన పరిణామంగా మారింది. అయితే పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్కు సిద్ధమవుతున్న సామాన్య ప్రజలకు మాత్రం ఈ ధరలు భారంగా మారుతున్నాయి. జ్యువెలరీ కొనుగోలు ప్లాన్ చేసిన వారు ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారు. అంతర్జాతీయంగా LBMA వంటి సంస్థలు కూడా బంగారం ధరలపై ఆసక్తికర అంచనాలు ఇస్తున్నాయి. గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగితే 2026 వరకు కూడా పసిడి ర్యాలీ కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత గ్లోబల్ అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం సురక్షిత పెట్టుబడిగా మారింది. తాత్కాలికంగా ధరలు తగ్గే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే సామాన్య కొనుగోలుదారులు అవసరం మేరకే కొనుగోలు చేయడం, ఇన్వెస్టర్లు దీర్ఘకాల వ్యూహంతో ముందుకెళ్లడం మేలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Written by: Qamar SD, Vaasthava Nestham Editorial Team, Published: January 21, 2025 | 12:20 PM
