నేడు పెట్టిన వితనం భవిష్యత్తులో మహావృక్షం అవుతుందని నానుడి ఉంది. ఇదే నానుడిని ఫాలో చేస్తూ చాలామంది పెట్టుబడుల విషయానికి వస్తే బంగారంలో పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో అధిక లాభం పొందవచ్చు పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పటికీ బంగారం తొలి ఎంపికగానే ఉంది. తరతరాలుగా భద్రతకు చిహ్నంగా భావించే ఈ లోహం, కుటుంబ సంపదలో పెద్ద వాటాను ఆక్రమించింది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడి దిశ మారాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సంస్థలు సూచిస్తున్నాయి. అయితే ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో, భారత స్టాక్ మార్కెట్ (సెన్సెక్స్) ప్రస్తుతం బంగారంతో పోలిస్తే తక్కువ విలువ వద్ద ట్రేడవుతోందని పేర్కొంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది గమనించాల్సిన విషయంగా మారుతోంది.
బంగారం–సెన్సెక్స్ పోలిక: మార్కెట్ ఏం చెబుతోంది..?
1991 నుంచి 2025 వరకు ఉన్న డేటాను ఆధారంగా తీసుకుని మోర్గాన్ స్టాన్లీ ఈ విశ్లేషణ చేసింది. సెన్సెక్స్ విలువను బంగారం ధరతో పోల్చినప్పుడు, ప్రస్తుతం మార్కెట్ గత కొన్ని దశాబ్దాల్లో కనిపించిన కనిష్ట స్థాయిల దగ్గర ఉందని నివేదిక వెల్లడించింది. ఇలాంటి పరిస్థితులు గతంలో 2003–04లో మార్కెట్ ర్యాలీకి ముందు, అలాగే 2008–09 ఆర్థిక సంక్షోభం అనంతరం నమోదయ్యాయి. ఆ సమయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినవారు, తరువాతి సంవత్సరాల్లో గణనీయమైన రాబడులు పొందారని నివేదిక గుర్తు చేస్తోంది. ప్రస్తుతం బంగారం వేగంగా పెరిగినా, ఈక్విటీ మార్కెట్ ఆ స్థాయిలో ఇంకా పెరగలేదన్నదే ఈ విశ్లేషణలో ప్రధాన అంశంగా చెపుతున్నారు. దీంతో పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
భారతీయ పెట్టుబడుల్లో మారుతున్న దిశ
మోర్గాన్ స్టాన్లీ గణాంకాల ప్రకారం, 2025 మార్చి నాటికి భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ సుమారు 3.6 ట్రిలియన్ డాలర్లు కాగా, స్టాక్స్ రూపంలో ఉన్న సంపద మాత్రం 1.1 ట్రిలియన్ డాలర్లకే పరిమితంగా ఉంది. వార్షిక పొదుపుల్లోనూ బంగారానిదే ఆధిక్యం కొనసాగుతోంది. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో నెమ్మదిగా మార్పు కనిపిస్తోంది. పెరిగిన ఆర్థిక అవగాహన, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫాంలు, మార్కెట్ ఇచ్చిన దీర్ఘకాలిక రాబడులు… ఇవన్నీ కలిసి భారతీయులను ఫిజికల్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ వైపు మళ్లిస్తున్నాయి. ఈ మార్పును మోర్గాన్ స్టాన్లీ గ్రేట్ ఇండియన్ వెల్త్ బూమ్’ గా అభివర్ణించింది.
బంగారం ఎప్పటికీ భద్రమైన పెట్టుబడిగానే కొనసాగుతుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, సంపదను వేగంగా పెంచుకునే దిశగా ఈక్విటీలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ తక్కువ విలువ వద్ద ఉండటం, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అవకాశంగా మారుతున్నట్లు విశ్లేషణలు వివరిస్తున్న క్రమంలో పెట్టుబడులు పెట్టేవారు ఒక ప్రత్యేకమైన అవగాహనకు వచ్చి పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో కీలకంగా మారనుంది.
Note: Images used in this article are generated by AI for representation purposes.

