బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా భారతీయులు వెనక్కి తగ్గడం లేదు. ఒకప్పుడు ధరలు పెరిగితే కొనుగోళ్లు వాయిదా వేసుకునే జనం.. ఇప్పుడు రూట్ మార్చారు. పసిడి మార్కెట్ను అచ్చం స్టాక్ మార్కెట్లా చూస్తున్నారు. ధరలు ఏమాత్రం తగ్గినా ఎగబడి మరీ కొనేస్తున్నారు. ఈ సరికొత్త ట్రెండ్పై టైటాన్ (Titan) మేనేజింగ్ డైరెక్టర్ అజోయ్ చావ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తగ్గినప్పుడే ఎంట్రీ.. ఇన్వెస్టర్లలా ఆలోచిస్తున్న జనం
ఫిబ్రవరి (2026) ఆరంభంలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.61 లక్షల మార్క్ను తాకి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత గ్లోబల్ పరిస్థితుల కారణంగా కాస్త కరెక్షన్ వచ్చి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ కరెక్షన్ను సామాన్య కొనుగోలుదారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో ధరలు ఎప్పుడూ తగ్గుతాయా అని ఎదురుచూసే ‘ఫెన్స్ సిట్టర్స్’ (Fence Sitters).. ఇప్పుడు వ్యూహం మార్చారు. స్టాక్ మార్కెట్లో షేర్లు పడిపోయినప్పుడు కొనే (Buy on Dip) తరహాలోనే, గోల్డ్ ధరలు కాస్త తగ్గగానే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. ‘ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో మరింత పెరుగుతుందేమో’ అనే FOMO (Fear of missing out) ఫీలింగ్ కూడా ఈ ట్రెండ్ను మరింత వేగవంతం చేసిందని అజోయ్ చావ్లా విశ్లేషించారు.
ఖర్చు కాదు.. అదొక పక్కా పెట్టుబడి!
మన దేశంలో బంగారం అనేది కేవలం అలంకారం కాదు, అదొక సెంటిమెంట్. పెళ్లిళ్లు, పండుగలు వచ్చాయంటే పసిడి కొనుగోళ్లు జరగాల్సిందే. అయితే, ఇప్పుడు మహిళల ఆలోచనా విధానంలోనూ భారీ మార్పు వచ్చింది. బంగారు ఆభరణాలపై పెట్టే డబ్బును వృధా ఖర్చుగా కాకుండా, దీర్ఘకాలిక పెట్టుబడిగా, ఆస్తిగా భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా.. భారత్లో డిమాండ్ ఏమాత్రం పడిపోకపోవడానికి కుటుంబాల్లో వచ్చిన ఈ మార్పే ప్రధాన కారణం.
కాసుల వర్షం కురిపిస్తున్న ‘తనిష్క్’
వినియోగదారుల ఈ సరికొత్త ట్రెండ్ టైటాన్ జ్యూవెలరీ విభాగానికి కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా వారి ఫ్లాగ్షిప్ బ్రాండ్ ‘తనిష్క్’ (Tanishq) రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో ఆభరణాల విభాగం ఆదాయం ఏకంగా 45.6 శాతం జంప్ చేసి రూ.23,492 కోట్లకు చేరడం విశేషం. మొత్తం ఆర్థిక సంవత్సరం (FY25) లో టైటాన్ సాధించిన రూ.57,339 కోట్ల ఆదాయంలో 81 శాతానికి పైగా జ్యూవెలరీ విభాగం నుంచే రావడం డిమాండ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది.
దీర్ఘకాలంలో లాభాలే!
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్స్ వంటి మాక్రో ఎకనామిక్ అంశాలు పసిడి ధరలను శాసిస్తుంటాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో వోలటాలిటీ (హెచ్చుతగ్గులు) తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇవి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ను కంగారు పెట్టినా.. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మాత్రం పసిడి ఎప్పటికీ ‘సేఫ్ హెవెన్’ (సురక్షిత పెట్టుబడి) గానే నిలుస్తుందని మార్కెట్ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సైతం రిస్క్ తగ్గించుకునేందుకు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటం దీనికి నిదర్శనం.
భారతీయులు ఆర్థికంగా మరింత పరిణతి చెందుతున్నారని తాజా ట్రెండ్ నిరూపిస్తోంది. బంగారాన్ని కేవలం సెంటిమెంట్తో పాటు ఒక ‘స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ అసెట్’గా చూడటం మొదలుపెట్టారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ టెన్షన్స్ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. కొనుగోలుదారుల ఈ సరికొత్త అప్రోచ్ (బై ఆన్ డిప్స్) భవిష్యత్తులో వారికి అత్యుత్తమ రాబడులను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Note: Images used in this article are generated by AI for representation purposes.

