వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బజార్హత్నూర్ ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న ముత్యంపేట కాలనీలో రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతోందని డయల్-100 ద్వారా సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇత్తారి రాజేష్ , ధారంగుల దుర్గేష్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులపై తిరగబడి దురుసుగా ప్రవర్తిస్తూ, దాడికి దిగినట్లు ఎస్సై తెలిపారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో గొడవకు పాల్పడి శాంతి భద్రతలకు భంగం కలిగించిన ఇరువర్గాలకు చెందిన మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

