వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఇవాళ జనవరి 7వ తేదీ బుధవారం బంగారం ధరలు ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,410గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,650గా నమోదైంది. ఇక వెండి ధర కూడా భారీగానే ఉంది. ఒక కేజీ వెండి ధర రూ. 2,53,697కు చేరింది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో కనిపిస్తున్న వేగం చూస్తే పసిడి మరోసారి వార్తల్లో నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లను గమనిస్తే అమెరికా మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర
4,493 డాలర్లకు చేరింది. కేవలం రెండు రోజుల క్రితం వరకు 4,350 డాలర్ల దిగువన ట్రేడ్ అయిన బంగారం ఒక్కసారిగా దాదాపు 100 డాలర్లు బౌన్స్ బ్యాక్ కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. అమెరికా–వెనుజులా సంబంధిత ఘటనల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
అయితే ఆశ్చర్యకరంగా స్టాక్ మార్కెట్లు పెద్దగా కరెక్షన్ చూపకపోవడం కూడా గమనించాల్సిన విషయం. మరోవైపు బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్న అంశాల్లో ఫెడరల్ రిజర్వ్ పాలసీ అంచనాలు ఉన్నాయి. 2026లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్లో హాట్ టాపిక్గా మారాయి.
వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి నాన్-ఇంట్రెస్ట్ అసెట్స్కు డిమాండ్ పెరుగుతుంది. దీనికి తోడు డాలర్ విలువ బలహీనపడటం కూడా బంగారం ధరలు పెరగడానికి మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
టెక్నికల్ పరంగా చూస్తే బంగారం ధరలు ప్రస్తుతం సున్నితమైన దశలో ఉన్నాయని అనలిస్టులు చెబుతున్నారు. గోల్డ్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (RSI) ప్రస్తుతం 75 నుంచి 80 మధ్య ఉంది.
RSI 70 దాటితే ఓవర్బాట్ జోన్గా పరిగణిస్తారు. అంటే వాస్తవ డిమాండ్ కన్నా ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయని అర్థం.
ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బంగారం ధరలు ప్రస్తుతం 200 రోజుల మూవింగ్ అవరేజ్ కంటే చాలా ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. ధరలు చాలా వేగంగా పైకి వెళ్లినప్పుడు సహజంగానే ఒక దశలో కరెక్షన్ రావడం సాధారణమే.
2024 చివరి నుంచి 2026 ప్రారంభం వరకు గమనిస్తే బంగారం ధరలు దాదాపు ఒకే దిశలో బలంగా పెరిగాయి. టెక్నికల్ చార్ట్ ప్రకారం దీన్ని పారాబోలిక్ రైజ్గా పిలుస్తారు. ఇలాంటి ర్యాలీలు సాధారణంగా ఒక కరెక్షన్కు దారి తీస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మార్కెట్ సైకిల్ ప్రకారం చూస్తే బంగారం ఇప్పటికే రెండు నుంచి మూడు సంవత్సరాల బుల్ రన్ను పూర్తి చేసినట్టుగా అంచనా. ఈ దశలో ప్రాఫిట్ బుకింగ్ ఒత్తిడి పెరగవచ్చు. కొన్ని అంచనాల ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరల్లో 10 నుంచి 25 శాతం వరకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. UBS మెటల్స్ స్ట్రాటజిస్ట్ సైమన్ వైట్ కూడా తమ తాజా రిపోర్ట్లో బంగారం ప్రస్తుతం ఓవర్బాట్ జోన్లో ఉందని, టెక్నికల్ పరంగా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మొత్తంగా చూస్తే బంగారం ధరలు బలంగా ఉన్నప్పటికీ, ఈ

స్థాయిల్లో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణ ఊగిసలాటలు పెరిగే అవకాశం ఉన్నందున దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
Author: QAMAR SD
