ఏడాది కాలంగా నిరంతరం పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలకు మంగళవారం గణనీయమైన బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుతాయన్న అంచనాలు, అలాగే వెండిపై చైనా విధించిన ఎగుమతి ఆంక్షల ప్రభావంతో విలువైన లోహాల ధరల్లో భారీ దిద్దుబాటు నమోదైంది.
ప్రపంచ కమొడిటీ మార్కెట్లలో మదుపర్లు ఇటీవల లభించిన లాభాలను స్వీకరించడమే వెండి ధరలు అకస్మాత్తుగా తగ్గడానికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో ఉన్న ధరలు ఒక్కసారిగా కిందకు వచ్చాయి.
సోమవారంతో పోల్చితే మంగళవారం వెండి ధర కిలోకు ఏకంగా రూ.18 వేల వరకు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.58 లక్షలుగా ఉంది. అదే సోమవారం ఉదయం హైదరాబాద్లో కిలో వెండి ధర దాదాపు రూ.2.8 లక్షల వరకు పలికింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.4 లక్షలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండిపై ఒత్తిడి కొనసాగడమే ఈ తగ్గుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు బంగారం ధరలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో తగ్గాయి. మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.3 వేలకుపైగా పడిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,200గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,24,850గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,350గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,25,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారంపై అమ్మకాల ఒత్తిడి పెరగడంతో దేశీయ మార్కెట్లలోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ధరలు భారీగా తగ్గడంతో ఆభరణాల కొనుగోలుకు ఇది మంచి అవకాశం అని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే, మార్కెట్ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉండటంతో కొనుగోలు ముందు తాజా ధరలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

