వాస్తవ నేస్తం,బిజినెస్ డెస్క్: గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు మధ్యలో రెండు రోజులు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులు కాస్త ఊరట పొందారు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి కొనుగోలుదారులకు ఊహించని షాక్ ఇచ్చాయి. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ధరలు గణనీయంగా పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
దేశీయ మార్కెట్లో శుక్రవారం ఉదయం బంగారం ధర ఏకంగా రూ.700 వరకు పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.1,38,710గా కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర కూడా రూ.660 పెరిగి రూ.1,27,150 స్థాయికి చేరింది. ఉదయం ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇది స్పష్టమైన పెరుగుదలగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే హైదరాబాద్లో ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,710గా ఉంది. అయితే ఉదయం 6 గంటల సమయంలో ఈ ధర రూ.1,37,990గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,150గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధరలు అమలులో ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. కోల్కతా, ముంబై, బెంగళూరు నగరాల్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,38,710గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం స్వల్పంగా ఎక్కువగా రూ.1,38,860గా కొనసాగుతోంది. చెన్నైలో అయితే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,39,640గా నమోదైంది.
ఇటు బంగారం ధరలు పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇస్తుండగా, అటు వెండి మాత్రం కొంత ఊరటనిచ్చింది. శుక్రవారం ఉదయం నుంచి కొద్ది గంటల వ్యవధిలో వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. ఉదయం 6 గంటలకు కేజీ వెండి ధర రూ.2,51,900గా ఉండగా, దాదాపు రూ.3,000 తగ్గి ప్రస్తుతం రూ.2,49,000 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల కదలికలు, డాలర్ మారకం విలువలో మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దేశీయ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో డిమాండ్ పెరగడం కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశముంది. అందుకే బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు రోజువారీ ధరల మార్పులను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
Author: Qamar SD
