వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు. అది భద్రత, సంప్రదాయం, పెట్టుబడి అన్నింటి సమ్మేళనం. పెళ్లిళ్లు, పండుగలు వచ్చినప్పుడు ఇప్పటికీ ఫిజికల్ గోల్డ్ కొనడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అయితే కాలం మారుతోంది. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు బంగారంలో పెట్టుబడులంటే కొత్త ట్రెండ్గా మారింది Gold Exchange Traded Funds అంటే Gold ETFలు. ఇటీవల విడుదలైన గణాంకాలు చూస్తే భారతీయ Gold ETFలలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు ప్రవహించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా 2025 డిసెంబర్ నెల గోల్డ్ మార్కెట్కు ఒక మైలురాయిగా మారింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక ప్రకారం, 2025 డిసెంబర్ నెలలో భారతీయ Gold ETFలలోకి సుమారు 1.25 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.10,400 కోట్ల మేర నికర పెట్టుబడులు వచ్చాయి. ఇది నవంబర్ నెలలో నమోదైన 379 మిలియన్ డాలర్లతో పోలిస్తే సుమారు 231 శాతం పెరుగుదల కావడం గమనార్హం. అంతేకాదు, గత ఏడాది వరుసగా ఏడు నెలల పాటు Gold ETFలలోకి పెట్టుబడులు కొనసాగాయి.
ఈ భారీ ఇన్ఫ్లోలతో గ్లోబల్ గోల్డ్ ETF మార్కెట్లో భారత్ కీలక స్థానాన్ని సంపాదించుకుంది. డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పెట్టుబడులు సాధించిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. చైనా, బ్రిటన్ వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత్ ఈ స్థాయికి చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.
ఇన్వెస్టర్లు ఒక్కసారిగా Gold ETFల వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు అన్న ప్రశ్నకు సమాధానం బంగారం ధరల పెరుగుదలలోనే దాగి ఉంది. గత ఏడాది బంగారం ధరలు 50 శాతం పైగా పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, స్టాక్ మార్కెట్లలోని ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను సురక్షిత పెట్టుబడుల వైపు నడిపిస్తున్నాయి.
ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే Gold ETFలు ఇన్వెస్టర్లకు మరింత సౌకర్యవంతంగా మారాయి. భద్రపరచాల్సిన అవసరం లేకపోవడం, దొంగతన భయం లేకపోవడం, స్టాక్ మార్కెట్ పని వేళల్లో ఎప్పుడైనా కొనుగోలు చేయడం, విక్రయించడం సులభం కావడం ఇవి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలు. అంతేకాదు, ఇవి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలకు అనుగుణంగానే ట్రేడ్ అవుతాయి.
మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటి అదనపు ఖర్చులు లేకపోవడం కూడా Gold ETFలకు డిమాండ్ పెరగడానికి మరో ప్రధాన కారణంగా మారింది. ఈ కారణాలన్నింటితో ఇన్వెస్టర్లు సంప్రదాయ బంగారం కొనుగోళ్ల కంటే డిజిటల్ మార్గంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్స్, డాలర్ విలువలో మార్పులు బంగారం ధరలను మరింత బలపరుస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం స్వల్పకాలంలో కొంత వోలటిలిటీ ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడిగా Gold ETFలు సురక్షితమైన ఎంపికగానే కొనసాగనున్నాయి.

మొత్తంగా చూస్తే సంప్రదాయ బంగారం ప్రేమను కొనసాగిస్తూనే ఆధునిక పెట్టుబడి మార్గంగా Gold ETFలు భారతీయ ఇన్వెస్టర్లకు కొత్త దారిని చూపిస్తున్నాయి. మీ పోర్ట్ఫోలియోలో కనీసం 10 నుంచి 15 శాతం బంగారంలో పెట్టుబడి పెట్టడం ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బంగారంపై కాసుల వర్షం కురుస్తున్న ఈ సమయంలో Gold ETFలు పెట్టుబడిదారుల కొత్త ఫేవరెట్గా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Author: Qamar SD
