మావోయిస్టు పార్టీ కి చెందిన కీలక నేతలు ఒకరు ఒకరుగా పోలీసులకు లొంగిపోతూ జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. దీంతో మావోయిస్టు పార్టీ కి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు కీలకనేత బండి ప్రకాష్ లొంగిపోయారు. ప్రకాష్ అలియాస్ క్రాంతి మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్నారు. నేషనల్ పార్క్ ఏరియాకి ఆర్గనైజర్ హోదాలో ఉన్న బండి (Bandi Prakash) పోలీసులకు లొంగిపోవటం అంటే మావోయిస్టుపార్టీ కి (Maoist surrender) పెద్దదెబ్బనేచెప్పాలి. ఎందుకంటే అబూజ్ మడ్(Abujhmarh forest) అడవుల్లోని నేషనల్ పార్క్ ఏరియా మావోయిస్టులకు పెట్టని కోటలాగుండేది. చత్తీస్గడ్ అడవుల్లోకి ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో భద్రతాదళాలు చొచ్చుకుని పోతున్నాయి.
ప్రకాష్ సొంతూరు మంచిర్యాల జిల్ల మందమర్రి. 1982-84 మధ్య ‘గో టుతది విలేజెస్’ అనే ఉద్యమం ద్వారా ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరి ఎదిగారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘం సింగరేణి కార్మిక సంఘం(సికాస) అధ్యక్షుడిగా పనిచేశారు. ఈమధ్యనే పోలీసులకు లొంగిపోయిన తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నతో పాటు బండి ప్రకాష్ కూడా లొంగిపోతాడని బాగా ప్రచారం జరిగింది. అయితే ఎందుకనో అప్పుడో లొంగిపోని ప్రకాష్ ఈరోజు విడిగా డీపీజీ ముందు లొంగిపోయారు.
ఆశన్న లొంగుబాటుకు ముందు మల్లోజుల వేణుగోపాలరావు కూడా తన మద్దతుదారులతో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టుల ఏరివేతే టార్గెట్ గా కేంద్రప్రభుత్వం పనిచేస్తేన్న విషయం తెలిసిందే. 2026, మర్చి 31వ తేదీకి మావోయిస్టు రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యాన్ని కేంద్రప్రభుత్వం మహారాష్ట్ర, ఒడిస్సా, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో విజయవంతంగా ముందుకెళుతోంది. గడచిన పదిమాసాల్లో సుమారు 1500 మావోయిస్టులు వివిధ ఎన్ కౌంటర్లలో చనిపోగా కొన్ని వందలమంది లొంగిపోయారు. బండి ప్రకాష్ లొంగిపోయిన తరహాలోనే ఇంకా చాలామంది కీలకనేతలు లొంగిపోయేందుకు సిద్ధపడుతున్నారని సమాచారం.
