• విధి నిర్వహణలో అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
• ఘనంగా అమరవీరుల స్మరణ దినోత్సవం
• పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: శాంతి భద్రతల పరిరక్షణ మరియు దేశ సరిహద్దు రక్షణ కోసం విది నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో గల అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అమరవీరుల స్తూపం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమరులైన పోలీసుల ముఖ చిత్రాలతో ఏర్పాటు చేయడం తెలంగాణలోనే ప్రధమంగా ఉండటం విశేషం. స్తూపం వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యంగా అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్చాలతో స్తూపం వద్ద నివాళులర్పించచారు. జిల్లా పోలీసు యంత్రాంగం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే సందర్భంగా భారీ ఏర్పాట్ల మధ్య అమరవీరులను స్మరించుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం, దేశ రక్షణలో విధి నిర్వహణమే ముఖ్యంగా అసువులు బాసిన 191 మంది పోలీసు సిబ్బంది, అధికారుల పేర్లను అదనపు ఎస్పీ ఆపరేషన్ సురేందర్రావు చదువుతూ స్మరించుకోవడం జరిగింది. మొదటగా ఉన్నతాధికారులు అందరూ కలిసి స్తూపం వద్ద జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసులు అమరవీరులకు గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఒక పోలీసు వ్యవస్థనే ఇతరుల కోసం ప్రాణాలను సైతం అర్పిస్తుందని తెలియజేశారు. పోలీసులు నిస్వార్ధమైన సేవలను అందిస్తారని వారికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ నేర నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి సంవత్సరం అమరవీరులను స్మరించుకుంటూ వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయాలని వారి కుటుంబ సభ్యులను సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేయాలని తెలియజేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. అక్టోబర్ 21న ప్రతి సంవత్సరం జరుపుకునే అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) 65 సంవత్సరాల క్రితం లడక్ సమీపంలో భారత సరిహద్దుల్లో పహారకాస్తున్న మన పోలీసు సిబ్బందిపై చైనీయులు దాడి చేశారని, ఈ ప్రదేశాన్ని హార్ట్ స్ప్రింగ్ గా పేర్కొంటారని,1959 అక్టోబర్ 21న ఆ సమయంలో విది నిర్వహణలో వీరోచితంగా పోరాడి చేయనీయుల చేతులు అసువులు బాసిన పదిమంది సిఆర్పిఎఫ్ జవాన్ల వీరమరణం సందర్భంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే దినోత్సవాన్ని అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పోలీసులు సంఘవిద్రోహశక్తులతో పోరాడి చిరస్మరణీయులైన విషయం గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నందు 50 మంది పోలీసు అధికారులు సిబ్బంది సంఘవిద్రోహశక్తులతో ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది యొక్క కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఎలాంటి అవసరాలైన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. అసువులు బాసిన పోలీసు ప్రతి ఒక్కరి స్ఫూర్తి బాటలో జిల్లా పోలీసు యంత్రాంగం కొనసాగుతుందని తెలియజేశారు. జిల్లాలోని అమరవీరులను, వారి త్యాగాలను స్మరించడానికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు వారి ముఖ చిత్రాలతో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు అదనపు ఎస్పి ఆపరేషన్ సురేందర్ రావు,డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, హసీబుల్లా, కమతం ఇంద్ర వర్ధన్, డిఎంహెచ్వో నరేంద్ర రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, ఆర్టీసీ ఆర్ఎం భవాని ప్రసాద్, రెండవ బెటాలియన్ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

