• ఉచితంగా ఎస్.ఐ.ఆర్ ఫారాల నమోదు
• సందేహాలు నివృత్తి చేసిన బీఎల్ఓలు
• సేవా దృక్పథాన్ని చాటుకున్న స్థానిక యువత
వాస్తవ నేస్తం,ఇచ్చోడ : మండల కేంద్రమైన ఇచ్చోడలోని ఇస్లాంపురా కాలనీ మదీనా మసీదు సమీపంలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా హెల్ప్ డెస్క్’కు విశేష స్పందన లభించింది. ఎస్.ఐ.ఆర్ (S.I.R) ఫారాలు పూర్తి చేయడంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, స్థానిక యువత ఆధ్వర్యంలో ఈ ఉచిత సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇస్లాంపురా కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ దరఖాస్తులను పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు ఎస్.కే. ఖలీల్, ఎస్.కే. మహబూబ్, మహమ్మద్ సాబీర్, గఫ్ఫార్, అఫ్రోజ్, ఎం.ఏ. అర్షద్, అన్వర్, ఉమర్ ఫారూఖ్, అబ్దుల్ ఖాదిర్ తదితరులు సందేహాలు నివృత్తి చేశారు. గంటల తరబడి ప్రజలకు సేవలు అందించి ఆదర్శంగా నిలిచారు. ఉచితంగా ఫారాలు పూర్తి చేసి ఇవ్వడంతో సామాన్యులకు ఎంతో ఉపశమనం లభించింది.
దరఖాస్తుల ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) సైతం ఈ శిబిరంలో అందుబాటులో ఉండి ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. దీంతో తప్పుల్లేని విధంగా ఫారాలను సకాలంలో పూర్తి చేసుకుని సబ్మిట్ చేసే అవకాశం లభించింది. ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరిగే వ్యయప్రయాసలు తప్పడంతో పాటు, పని ఎంతో సులభంగా పూర్తికావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలిచి, శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు, యువతకు కాలనీవాసులు, స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
